గుణపం దిగింది ప్రజావేదికలో..!గుచ్చుకుంది మాత్రం టీడిపి నేతల గుండెల్లో..!సీఎం నెక్ట్స్ టార్గెట్ అదేనా
అమరావతి/హైదరాబాద్ : ఒక్క దెబ్బ రెండు పిట్టలు అనే నానుడికి ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు. ఒక దెబ్బ వంద పిట్టలు అన్నట్టు మారింది ఏపిలో జగన్ దెబ్బ. ప్రజా వేదిక కూల్చివేతతో తెలుగుతమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుణపం దిగింది ప్రజా వేదికలో ఐతే అబ్బా నొప్పి అంటుంది మాత్రం ముమ్మాటికి తెలుగు తమ్ముళ్లే. జగన్ అన్నంత పనిచేశాడు. కోట్లరూపాయల విలువైన ప్రజావేదికను భూతస్థాపితం చేసాడు. ఇది పసుపు తమ్ముళ్లకు తీవ్ర అవమానంగా పరిణమించింది.
నలభై ఏళ్ల చరిత్ర అంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరిగే టీడిపి కి చెంపపెట్టు. చెరువులు, వాగులు, నదులు, వంటి భూముల్లో... చుట్టుపక్కల ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదనే వాల్టా చట్టం చెబుతోంది. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని పదే పదే పాలకులకు గుర్తుచేస్తోంది. కోర్టులంటే లెక్కలేకపోయినా ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే ఇటువంటి ఉల్లంఘనలు తలపెట్టకూడదని కనీసం పాలకులైనా గుర్తించాలి. అందుకు ఏపి సీఎం జగన్ పూనుకున్న కార్యానికి నలువైపుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.
Recommended Video
అక్రమం అని తెలిసినా టీడిపి తప్పు చేసింది..! అందుకు శిక్షపడిందంటున్న వైసీపి..!!
చెన్నైను చూస్తే నీటి కష్టాలు తెలుస్తాయి. ఇదే పరిస్థితి రేపు, తెలంగాణ, ఏపీలకు వస్తే. పానీపట్టు యుద్ధాలు జరుగుతాయి. అందుకే నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ మాత్రం తెలియని నేత కాదు చంద్రబాబు. ఇరవైఏళ్ల క్రితమే వాననీటిని నిల్వచేసేందుకు చెక్డ్యామ్లకు పునాది వేసిన ముందుచూపు గల చంద్రబాబు. కానీ 2014 తరువాత నిబంధనలు గాలికి వదిలేశారు. చినబాబు కనుసన్నల్లో పాలన సాగేందుకు వీలుగా ద్వారాలు తెరిచారు. కృష్ణమ్మ ఒడ్డున అడ్డగోలుగా నిర్మాణాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారు. ఇదంతా తప్పంటూ హైకోర్టు నోటీసులిచ్చినా స్పందించలేదు. ఇదే చంద్రరాజ్యం అనేంతగా తమ్ముళ్లు చెలరేగారు.
టీడిపి ని కోర్టు కూడా కాపాడలేక పోయింది..! సీఎం తర్వాత టార్గెట్ అదేనా..!!
ఏకంగా 54 ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యకలాపాలకు కరకట్టను కేరాఫ్ గా మార్చారు. నిర్మాణాల కోసమంటూ వందలకోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కుమ్మరించారు. దానిలో తమ వాటాను పంచుకున్నారు. 2017లో హైకోర్టు నాటి సీఎం చంద్రబాబుకు నోటీసు జారీచేసినా స్పందించలేదనే చర్చ బయటకు వచ్చింది. ఆ వెనుకనే భారీ భవంతులు కట్టిన లింగమనేని వంటివారు కూడా అదేపనిచేశారట. అందుకే జగన్ దానిపై కఠినంగానే వ్యవహరించారు. టీడీపీ నేతలు ఇదంతా అన్యాయమంటూ నెత్తీనోరు కొట్టుకున్నా లెక్కపెట్టలేదు. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన వారిని న్యాయస్థానం ఇక్కడ ప్రజా ప్రయోజనం ఏముంది అంటూ నిలదీయటంతో తెలుగు తమ్ముళ్లు తెల్లమొహం వేసినట్టు తెలుస్తోంది.
ఝడుసుకుంటున్న తెలుగుతమ్ముళ్లు..! ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే..!!
ఇదంతా తప్పుడు నిర్మాణమంటూ స్వయంగా కోర్టు ఆదేశాలను చూపి మరీ మొట్టికాయలు వేయటంతో టీడీపీ నేతలకు తమ అధినేత తప్పులు ప్రపంచానికి తెలిసిందంటూ తెగ బాధపడిపోతున్నారట. చంద్రబాబుకు ఇది ఊహించని పరాభవం. నాడు ఎన్టీఆర్ పై చెప్పు విసిరినపుడు ఎంతటి మనోవేదనకు గురై ఉంటారు. ఇప్పుడు తమ నాయకుడి పరిస్థితి అదేనంటూ తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట.ఇప్పుడు జగన్ తరువాత నిర్ణయం ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. రాజధాని నిర్మాణంలో సేకరించిన భూములు, అసైన్డ్ భూములకు పట్టాలు సృష్టించి దొంగదారిన ప్లాట్లు పొందిన బడాబాబుల లెక్కలు తీయమంటూ అధికారులకు జగన్ ఆదేశాలు అందినట్టు సమాచారం.
తర్వాత రాజధాని భూములే..! అక్రమ స్వాధీనాలని తేలితే గత ప్రభుత్వానికి కష్టాలే..!!
కరకట్ట పై అక్రమంగా నిర్మించిన కట్టడాల్లో వైసీపీ నేతలవి ఉన్నా తొలగించాలంటూ జగన్ అధికారులకు స్పష్టంగా చెప్పారట. లా అండ్ ఆర్డర్ విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు పైరవీలు చేసినా ఉపేక్షించవద్దంటూ తెగేసి చెప్పారట. పైగా.. అదికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే అన్నా నేను మిమ్మల్ని నమ్మానంటూ సాక్షాత్తూ జగన్ మాట్లాడటాన్ని అధికారులు సానుకూలంగా తీసుకున్నారట. ఈ లెక్కన మున్ముందు చంద్రబాబు అధికారిక నివాస తమ్ముళ్ల గెస్టు, రెస్టు హౌస్లకు గుణపం పోటు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతే కాకుండా జగన్ తర్వాత రాజధాని భూముల్లో జరిగిన అవతవకలపై టార్గెట్ చేయబోతారని, రైతులతో చర్చించి బలవంతపు భూసేకరణకు గురైన రైతులకు ఆ భూములను తిరిగి ఇచ్చేస్తారనే చర్చ జరగుతోంది. ఇదే ఏపి సీఎం జగన్ నెక్ట్స్ టార్గెట్ గా ప్రచారం జరుగుతోంది.