ప్రజావేదిక కూల్చేస్తే మాకేందుకులే అనుకొన్నారు.. మీదాకా వస్తే గానీ, మందడం రైతులతో చంద్రబాబు
వైసీపీకి అధికారం కట్టబెట్టి ప్రజలు నెత్తిమీద అగ్నిగుండం పెట్టుకున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ హయాంలో పోలీసులు కూడా చట్టాన్ని అతిక్రమిస్తున్నారని పేర్కొన్నారు. తప్పు చేస్తే కేసు పెట్టాలే తప్ప.. ప్రభుత్వ అనుకూలంగా పనిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాజధాని తరలింపు నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురై.. నిరసన చేపడుతుంటే పెయిట్ ఆర్టిస్టులు అని ఓ టీవీ చానెల్ ఓనర్ అనడం సమంజసం కాదన్నారు. బిర్యానీ కోసం మీటింగులకు వస్తోన్నారా అని నిందలు వేయడం మంచి పద్ధతి కాదని చంద్రబాబు అన్నారు. అతనికి తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని.. అందుకోసమే నోరు పారేసుకుంటున్నాడని చెప్పారు.
సీఎం జగన్ అమరావతిని చంపేయాలని చూస్తున్నారు, 'పిచ్చి కుక్క’ కథ చెప్పిన చంద్రబాబు
5 కోట్ల మంది సిద్ధం
రాజధాని ప్రాంత రైతులపై ఒక్క కేసు పెడితే 5 కోట్ల మంది సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడారని, అదేవిధంగా అమరావతి కోసం త్యాగం చేసేందుకు 5 కోట్ల మంది సిద్దంగా ఉండాలని కోరారు. అమరావతి అంటే అవకాశాలకు పందిరి అని చంద్రబాబు గుర్తుచేశారు. అమరావతి అభివృద్ధి చేసుకోకుండా పొట్ట కూటి కోసం మళ్లీ హైదరాబాద్ వెళ్లాలా అని ప్రశ్నించారు.
వలసబాట తప్పదా..?
పచిపాని కోసం హైదరాబాద్ పోవాలా ? మట్టిపనుల కోసం భాగ్యనగరానికి వలసబాట్ట పట్టాలా ? గేట్ పని కోసం సిటీ వెళ్లాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో పాలుపంచుకొంటున్న సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా పంపించేశారని తెలిపారు. అమరావతి ప్రాంత రైతులు కూడా తొలినాళ్లలోనే స్పందిస్తే బాగుండేదని చంద్రబాబు పేర్కొన్నారు.
మాకెందుకులే అని..
ప్రజావేదికను కూలగొట్టినప్పుడు మాకేందుకులే అని అనుకున్నారు. తన ఇళ్లు పడగొట్టినప్పుడు కూడా పట్టించుకోలేదు. చివరికి అమరావతి మునిగిపోతుందని అనే సరికి తమ వరకు వచ్చిందని అనుకొని మేల్కొన్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో మంచి కంటే చెడు జరుగుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు.
మైండ్గేమ్
సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న తనతోనే గేమ్స్ ఆడుతున్నారని.. ఇక మీరో లెక్కన అని రైతులతో అన్నారు. దీనిని బట్టి పులివెందుల పంచాయతీ అంటే ఏంటో అర్థమవుతోందని చెప్పారు. అమరావతి రాజధానిని తన కోసం కాకుండా భవిష్యత్ తరాలను ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. కానీ రాజధాని పేరుతో బెదిరిస్తే భయపడబోనని, అలిపిరి వద్ద మావోయిస్టులు దాడి చేస్తేనే ధైర్యంగా ఎదుర్కొన్నానని చంద్రబాబు తెలిపారు.