ప్రజా వేదిక కూల్చకుండా ఉండాల్సింది .. టీడీపీ భూస్థాపితం మా లక్ష్యం కాదన్న పురంధరేశ్వరి
ఏపీలో బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది . టీడీపీ నుండి నలుగురు రాజ్య సభ సభ్యులు పార్టీ వీడి బీజేపీలో చేరారు. ఇక ఆ తర్వాత నుండి బీజేపీలోకి టీడీపీ నేతల పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి . మొన్నటికి మొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే , సినీ నిర్మాత అంబికా కృష్ణ బీజేపీలో చేరితే నిన్నటికి నిన్న పామర్రు టీడీపీ కీలక నేత పొట్లూరి హరి బాబు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక ఈ విషయంపై స్పందించారు బీజేపీ నేత పురందేశ్వరి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ టీడీపీ వాళ్లను తాము రమ్మని కోరడం లేదని వారే వచ్చి చేరుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలన్నది తమ లక్ష్యం కాదని ఆమె స్పష్టం చేశారు.
రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ .. ఎందుకంటే
బాలకృష్ణకు సమీప బంధువు అయిన పొట్లూరి హరిబాబు చేరికలో కీలక భూమిక పోషించిన పురంధరేశ్వరి టీడీపీలో ఉన్న బంధు వర్గాన్ని బీజేపీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్న తరుణంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ప్రజా వేదిక కూల్చివేతపైన కూడా ఆమె స్పందించారు. అనధికారిక కట్టడాలను ఎవరైనా కూల్చివేయాల్సిందేనన్న పురంధరేశ్వరి ప్రజావేదికను కూల్చకుండా ప్రజావసరాల కోసం వినియోగించి ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు.ఇక ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను జగన్ పక్కదోవ పట్టించవద్దని ఆమె కోరారు.
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అంతులేని అవినీతి జరిగిందని అందుకే ఏపీ ప్రజలు టీడీపీని తిరస్కరించారని పురంధరేశ్వరి పేర్కొన్నారు. మోడీ రెండోసారి ప్రధాని అవ్వకుండా విపక్షాలన్నీ కుట్రలకు పాల్పాడ్డాయని ఆమె మండిపడ్డారు. బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాదని చంద్రబాబు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు . అయినా ప్రజలు మోడీ నాయకత్వాన్ని నమ్మి నరేంద్రమోడీకే పట్టం కట్టారని పురంధేశ్వరి తెలిపారు.