ప్రజావేదిక కూల్చివేత షురూ.. పూర్తి కూల్చివేతకు ప్రత్యక్ష సాక్షి కానున్న చంద్రబాబు?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది. టీడీపీ హయాంలో ప్రజావేదికను నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణం జరిగిందని అన్నారు. అక్రమకట్టడాలు కూల్చివేత కార్యక్రమం ప్రజావేదికతోనే మొదులకావాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం జగన్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ల సమావేశం ముగియగానే భవనం కూల్చివేతకు అధికారులు సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే అక్కడికి జేసీబీలు చేరుకుని కూల్చివేతను ప్రారంభించాయి.అంతకంటే ముందు ప్రజావేదిక భవనంలోని ఫర్నీచర్ను మరోచోటికి తరలించగా అందులోని పూలకుండీలను హైకోర్టు దగ్గరలోని నర్సరీకి తరలించారు అధికారులు.
ఇక ఈ నెల ప్రారంభంలో ప్రజావేదిక భవనం తనకు కేటాయించాలంటూ చంద్రబాబు నాయుడు సీఎం జగన్కు ప్రతిపక్షనేత హోదాలో తొలి లేఖ రాశారు. అయితే చంద్రబాబు విజ్ఞప్తిని జగన్ ప్రభుత్వం తిరస్కరించింది. అక్రమంగా ఉన్న కట్టడాలను కూల్చి తీరుతామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ప్రజావేదికను కూల్చడాన్ని టీడీపీ వ్యతిరేకించింది. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడం తుగ్లక్ చర్యగా అభివర్ణించింది. ప్రజావేదికను ప్రజల సమస్యలు చర్చించడంకంటే పార్టీ కార్యక్రమాలే ఎక్కువగా టీడీపీ నిర్వహించిందని మంత్రి అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తుగ్లక్ పాలన చేశారు కాబట్టే ప్రజలు సరైన సమాధానం టీడీపీకి ఇచ్చారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.
ఇక కూల్చివేతలో భాగంగా ముందుగా ప్రహరీ గోడను జేసీబీలతో కూల్చి వేశారు. శిథిలాలను లారీలతో తరలించారు. ప్రజావేదికలో ముందుగా ఎలివేషన్ కోసం ఏర్పాటుచేసిన అల్యూమినియం ఫ్రేమ్లు, అద్దాలతో చేసిన వస్తువులు, తలుపులను జాగ్రత్తగా తొలగించి వాటిని తిరిగి వినియోగించుకుంటామని సీఆర్డీయే అధికారులు తెలిపారు. ఈ కూల్చివేత ప్రక్రియలో వందకుపైగా కూలీలు పాల్గొన్నారు.జేసీబీలు, శిథిలాలను తరలించేందుకు లారీలు వినియోగించారు అధికారులు.
#WATCH: Demolition of 'Praja Vedike' building underway in Amaravati. The building was constructed by the previous government led by N. Chandrababu Naidu. #AndhraPradesh pic.twitter.com/qRCWjfVTJZ
— ANI (@ANI) June 25, 2019
ఇక ఈ అర్థరాత్రికల్లా ప్రధాన కూల్చివేతలు పూర్తవుతాయని... మిగతాది బుధవారం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ అర్థరాత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు విజయవాడకు చేరుకోనున్నారు. మరి ఆయన నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రజావేదిక కూల్చివేతపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభుత్వం ఒక్క ప్రజావేదిక కూల్చివేతతోనే ఆగిపోతుందా లేక కరకట్టపై ఉన్న లింగమనేని ఎస్టేట్ను కూడా కూల్చివేస్తుందా అనేది వేచిచూడాలి. ప్రజావేదిక కూల్చివేతను స్థానిక రైతులు హర్షిస్తున్నారు. జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని అక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్ అనుకుంటే అది టీడీపీ దర్బార్గా మార్చివేశారని మరికొందరు స్థానికులు మండిపడ్డారు.