కృష్ణా పుష్కరాలు: ప్రకాశం బ్యారేజీకి శోభ, రాజధాని ఐకాన్గా ఎంపిక
విజయవాడ: ప్రస్తుతం నవ్యాంధ్ర నూతన రాజధానిగా కొనసాగుతున్న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి మహర్దశ పట్టనుంది. ప్రకాశం బ్యారేజీని అమరావతి రాజధాని ఐకాన్గా తీర్చిదిద్దాలని కృష్ణా జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీపై విద్యుద్దీపాలంకరణ చేపడుతున్నారు.
ఈ బాధ్యతలను శ్రీ హరిథామ్ సంస్థకు అప్పగించారు. కృష్ణా-గుంటూరు జిల్లాలను కలిపే ఈ ప్రకాశం బ్యారేజీని ఓ పర్యాటక కేంద్రంగా మార్చాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయనతో పాటు శ్రీ హరిథామ్ సంస్థ ప్రతినిథులు ఆయనతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కృష్మా జిల్లా కలెక్టర్ బాబు మాట్లాడుతూ విజయవాడ నగరానికి ప్రకాశం బ్యారేజీ తలమానికంగా ఉందని అన్నారు. త్వరలో రానున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బ్యారేజీని సర్వాంగ సుందరంగా తీర్దిదిద్దనున్నట్లు చెప్పారు.
దీనికోసం ఇప్పటికే అనేక సంస్థలు తగిన ప్రతిపాదనలతో ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. అయితే దీనిని శాశ్వత అలంకరణగా పనులు చేపట్టాలని భావిస్తున్నట్టు కలెక్టర్ బాబు తెలిపారు. కృష్ణా పుస్కరాలకు ఇంకా వంద రోజుల సమయం ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజీకి శోభ తీసుకు వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆయా సంస్థలకు ఆయన సూచించారు.
దీనిపై శ్రీహరిధామ్ సంస్థ ప్రతినిథులు తమ ప్రతి పాదనలను కలెక్టర్ బాబుకు వివరించారు. బ్యారేజీకి రెండు వైపులా అత్యద్భుత విద్యుత్ దీప కాంతులతో లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయగలమని చెప్పారు. అలాగే బ్యారేజీపై లేజర్ షోను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని, ఇది బ్యారేజీకే హైలెట్గా నిలుస్తుందని తెలిపారు.
దీంతో పాటు లైటింగ్ డాన్స్ను ఏర్పాటు చేస్తామని ఇది చాలా దూరం వరకు కాంతిని ఫోకస్ చేస్తుందని చెప్పారు. అదే విధంగా ప్రీమియర్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేసి ఆహ్లాదాన్ని పంచే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. బ్యారేజీని అందంగా అలంకరించి మరింత శోభ తీసుకురావడానికి తగిన ప్రతిపాదనలను త్వరలో సమర్పిస్తామని చెప్పారు.