నిత్య పెళ్లి కూతురు స్వప్న.. కేంద్రమంత్రి నిర్మల పేరునూ వాడేసుకుంది.. నాలుగో భర్తపై కేసు పెట్టబోయి..
అసలే మాయలేడీ.. పెళ్లు చేసుకుంటూ మోసాలకు పాల్పడటం ఆమె శైలి.. అందుకోసం ఎంత పెద్దవాళ్ల పేర్లనైనా వాడేసుకుంటుంది.. తాను ఐపీఎస్ అధికారిణి అని కూడా పోజు కొట్టింది.. అలా ఆరేళ్ల వ్యవధిలో ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని.. ఆ నలుగురి నుంచీ లక్షల మొత్తాన్ని గుంజేసింది.. ఈ క్రమంలో అంతా అనుకూలంగా ఉందనే భ్రమలో.. పోరాని చోటికి పోయి పీకలమీదికి తెచ్చుకుంది. క్రైమ్ థ్రిల్లర్ ను తలపించే ఈ వాస్తవ గాథపై ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫణిభూషణ్ చెప్పిన వివరాలివి..
షాకింగ్: చైనా పైకి అమెరికా యుద్ధవిమనాలు - షాంఘైకి అతి సమీపంగా చక్కర్లు - తీవ్ర ఉత్కంఠ
పెళ్లికో పేరు..
మ్యాట్రిమోని వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకుని, డబ్బున్న యువకులకు వల వేస్తూ, ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని, కొన్నాళ్ల సంసారం తర్వాత, కావాలనే గొడవలు పెట్టుకుని, భరణం కింద భారీగా డబ్బులు గుంజుతూ మోసాలకు పాల్పడుతోన్న కి‘లేడీ' గుట్టును ప్రకాశం జిల్లా దొనకొండ పోలీసులు రట్టు చేశారు. తిరుపతికి చెందిన యువతి అసలు పేరు పతంగి స్వప్న కాగా, పెళ్లిళ్ల కోసం పతంగి హరిణి, నందమురారి స్వప్న, హరిణి చౌదరి అంటూ రకరకాల పేర్లతో చెలామణి అయ్యేది.
మేనమామతో మొదలుపెట్టి..
చిత్తూరు జిల్లాకే చెందిన స్వప్న తిరుపతిలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకునే రోజుల్లో మొదట మేనమామతో వివాహం జరిగింది. కొన్ని రోజులకే అతణ్ని వదిలించుకుని, తిరుపతికే చెందిన పృధ్వీరాజ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. తాను ఎవరూ లేని అనాథనని, జీవితాంతం తోడుంటానని నమ్మించి పృధ్వీరాజ్ ను వలలో వేసుకున్న స్వప్న.. పెళ్లైన కొన్నాళ్లకే అతడితో గొడవపడి పోలీసు స్టేషన్ లో వేధింపుల కేసు పెట్టింది. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఏపీ బీజేపీలో భారీ మార్పు: కన్నా ఔట్ - కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం - కారణం ఇదేనా?
ఆ తర్వాత ఎన్నారైలపై కన్ను..
రెండో భర్త పృధ్వీరాజ్ తో సెటిల్మెంట్ తో ముట్టిన సొమ్ముతో స్వప్న తన రేంజ్ మరింత పెంచుకుంది. మరింత స్టైలిష్ గా దిగిన ఫొటోల్ని మ్యాట్రిమోనిలో అప్ లోడ్ చేసి ఎన్నారైల కోసం వల వేసింది. జర్మనీ లో పనిచేసే ఆత్మకూరు(కర్నూలు జిల్లా)కు చెందిన సుధాకర్ అనే వ్యక్తిని మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా పరిచయం చేసుకుంది. పెళ్లి జరిగే లోపే అతని దగ్గర్నుంచి రూ.5 లక్షలు కాజేసింది. మ్యాట్రిమోని ద్వారానే, చివరిగా 2019 డిసెంబర్ లో ప్రకాశం జిల్లా వీరేపల్లికి చెందిన విప్పర్ల రామాంజనేయులును స్వప్న నాలుగో పెళ్లి చేసుకుంది. అతను డెన్మార్క్ లో ఉద్యోగం చేస్తున్నాడు.
కేంద్ర మంత్రి దగ్గర ఉద్యోగమంటూ..
రామాంజనేయులుతో నాలుగో పెళ్లి కోసం స్వప్న తన బయోడేటాలో అనూహ్య అంశాలు పేర్కొంది. తాను ఐపీఎస్ అధికారిణి అని, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర పని చేస్తున్నానంటూ కొన్ని తప్పుడు ఆధారాలను కూడా పేర్కొంది. మంచి సంబంధమని నమ్మి స్వప్నను పెళ్లాడిన రామాంజనేయులుకు నెల తిరిగేలోపే అనుమానం మొదలైంది. మ్యాట్రిమోనిలో ఆమె చెప్పిన వివరాలన్నీ తప్పని గ్రహించాడు. తెలిసినవాళ్ల ద్వారా ఎంక్వైరీ చేయగా స్వప్న మోసాలు బయటపడటంతో ఆమెకు చెప్పకుండా డెన్మార్క్ వెళ్లిపోయాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
Recommended Video
అత్తింటి ముందు ధర్నాతో కథ అడ్డం..
రామాంజనేయులు డెన్మార్క్ వెళ్లిపోయిన తర్వాత అతనితో బేరసారాలకు దారులన్నీ మూసుకుపోవడంతో స్వప్న అత్తారింటికి పయనమైంది. వీరేపల్లి గ్రామంలో ఉంటోన్న రామాంజనేయులు తల్లిదండ్రులు ఆమెను లోనికి రానీయలేదు. దీంతో స్వప్న ఇంటి ముందే ధర్నాకు దిగింది. ఎన్నారై భర్త తనను మోసం చేసి వెళ్లాడంటూ దొనకొండ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇటు రామాంజనేయులు పేరెంట్స్ కూడా కొడుకు అందించిన ఆధారాలతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా స్వప్న మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు దొనకొండ ఎస్ఐ ఫణిభూషణ్ తెలిపారు.