చక్రం తిప్పిన బాలినేని: వైసీపీ జిల్లా ప్లీనరీ సక్సెస్, కానీ, ఇదే పెద్ద దెబ్బ
ఒంగోలు: జిల్లాలో జరిగిన వైసీపీ ప్లీనరీలు ఆ పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపాయి. అంతేకాదు క్యాడర్ లో కదలికలను తెచ్చాయి. అదే సమయంలో సగం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోందని తేటతెల్లమైంది. మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చక్రం తిప్పి జిల్లా ప్లీనరీని సక్సెస్ చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ రాష్ట్ర ప్లీనరీని విజయవాడలో వచ్చే మాసంలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్లీనరీకి ముందుగానే ఆయా జిల్లాల ప్లీనరీలను నిర్వహించాలని ఆ పార్టీ భావించింది.ఈ మేరకు అన్ని జిల్లాల్లో పార్టీ ప్లీనరీలను నిర్వహించారు.
వైసీపీ ప్లీనరీల్లో భాగంగానే ఒంగోలు ప్లీనరీ మంగళవారంనాడు నిర్వహించారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలలో నలుగురు పార్టీని వీడి టిడిపిలో చేరారు.దీంతో ఈ ప్లీనరీలోకు ప్రాధాన్యం ఏర్పడింది.
జిల్లా ప్లీనరీల కంటే ముందే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ప్లీనరీలను నిర్వహించారు. అయితే అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా నిర్వహించిన ప్లీనరీలకు మిశ్రమ స్పందన లభించింది.
బాలినేని సక్సెస్
ప్రకాశం జిల్లాలో ప్లీనరీల విజయవంతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కృషి పలించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల వారీ పరిస్థితులను అధ్యయనం , ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన జిల్లా ప్లీనరీ విషయంలో లోపం రాకంుడా జాగ్రత్తలు తీసుకొన్నారు. నియోజకవర్గాల ప్లీనరీలకు హజరుకాని నేతలు కూడ జిల్లా ప్లీనరీకి హజరయ్యేలా ఆయన చేసిన ప్లాన్ సత్పలితాలను ఇచ్చింది.
దర్శి ప్లీనరీ హైలెట్
ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గస్థాయి వైసీపీ ప్లీనరీ హైలెట్ గా నిలిచింది. ఈ నియోజకవర్గం నుండి రెండు దఫాలు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన బూచేపల్లి కుటుంబం రెండేళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.అయితే ఈ ప్లీనరీని సవాల్ గా తీసుకొన్నారు. దీంతో ఈ నియోజకవర్గ ప్లీనరీ సక్సెస్ అయింది. ఆ తర్వాత పర్చూర్, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల ప్లీనరీలు జరిగాయని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.
క్యాడర్ లో కదలిక
ప్లీనరీల కారణంగా ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ లో కదలిక వచ్చిందని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. నియోజకవర్గాల్లో చురుకుగా పాల్గొన్న కార్యకర్తలే కాకుండా స్థానికంగా ఉన్న విబేధాల కారణంగా ప్లీనరీకి దూరంగా వారంతా జిల్లా ప్లీనరీకి హజరయ్యారు..జిల్లా ప్లీనరీ సక్సెస్ కావడంతో ఆ పార్టీ నాయకులు కూడ ఉత్సాహంగా పనిచేస్తున్నారు.అయితే కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్టు కన్పించింది. మరోవైపు కొందరు నేతలు, పార్టీ శ్రేణుల మధ్య కూడ సమన్వయలోపం కూడ పార్టీకి నష్టం కల్గించేలా ఉన్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ప్రభుత్వ వ్యతిరేకత కలిసొచ్చేనా?
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల నుండి వస్తోందనే అభిప్రాయాన్ని వైసీపీ నాయకత్వం వ్యక్తం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా పర్యటించిన సమయంలో సాధారణ ప్రజలు కూడ ఇధే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యతిరేకత తమకు కలిసివచ్చే అవకాశం ఉందని వైసీపీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. ముఖ్యనాయకులు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య కొంత సమన్వయలోపం ఉందని బాలినేని అంగీకరించారు.