ప్రకాశం వైసీపీలో మరో చిచ్చు- కరణం, పోతులపై పార్టీ పెద్దలకు ఆమంచి ఫిర్యాదు
చీరాల : ప్రకాశం జిల్లా వైసీపీలో మరో వర్గ పోరు బయటపడింది. చీరాల కేంద్రంగా ఆమంచి, కరణం, పోతుల వర్గాల మధ్య పోరు ఎప్పటి నుంచో పోరు సాగుతోంది. కానీ తాజాగా గత ఎన్నికల సమయంలో ఆమంచికి వ్యతిరేకంగా కరణం, పోతుల వర్గాలు కలిసిపోవడంతో ఆయన ఓడిపోయారు. తాజాగా వీరు ఆమంచిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా మాజీ సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కరణం, పోతుల వర్గాలు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్పై చేసిన విమర్శలు కలకలం రేపాయి. గత ఎన్నికలకు ముంది వైసీపీలోకి వచ్చిన ఆమంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై గెలిచిన కరణం బలరామ్ ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. అదే సమయంలో టీడీపీలో ఆమంచితో వైరం నడిపిన పోతుల సునీత కూడా వైసీపీలోకి వచ్చారు. దీంతో వీరిద్దరు ఏకమై ఇప్పుడు ఆమంచిని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై అధిష్టానానికి ఆమంచి లేఖ రాశారు.
వైఎస్ వర్ధంతి రోజు నివాళు అర్పించే కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న తనపై కరణం వెంకటేష్, పోతుల సునీత అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ అధిష్టానానికి ఆమంచి లేఖ రాశారు. ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి ఆమంచి ఈ లేఖ రాశారు.
పార్టీలో చేరినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించని వీరిద్దరూ తనపై మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించి వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆమంచి ఈ లేఖలో కోరారు. వైసీపీపైనా, సీఎం జగన్పైనా వీళ్లకు అభిమానం లేదని తన ఫిర్యాదు లేఖలో ఆమంచి తెలిపారు. 2019 ఎన్నికల్లో ఆమంచిపై కరణం బలరామ్ ను సమష్టిగా గెలిపించుకున్నామని పోతుల సునీత చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.