తప్పు చేశా, శిక్షించుకుంటున్నా: ఎండలో నిలబడ్డ జెడ్పీ చైర్మన్
ఒంగోలు: తాను తప్పు చేశానని చెబుతూ ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ హరిబాబు తనకు తాను శిక్ష వేసుకున్నాడు. సోమవారం నాడు అతను భోజన విరామ సమయంలో ఎండలో నిలబడి తాను చేసిన తప్పుకు శిక్ష వేసుకున్నాడు.
ప్రభుత్వ వాహనాన్ని తన సొంత అవసరాలకు ఉపయోగించుకున్న కారణంగా తనకు తాను శిక్ష విధించుకుంటున్నట్లు జడ్పీ ఛైర్మన్ హరిబాబు చెప్పాడు. ఛైర్మన్ హరిబాబు ప్రభుత్వ వాహనాన్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నారని గత సమావేశంలో సభ్యులు ఆరోపించారు.
సత్యసాయి సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివి: నరసింహన్
సత్యసాయి బాబా 90వ జయంతి వేడుకలు అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ మైదానంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ... సత్యసాయి బాబా ప్రపంచానికి విలువలతో కూడిన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారన్నారు. సత్యసాయి చేపట్టిన సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివని కొనియాడారు. విద్య, వైద్యమే కాక పేద ప్రజలకు తాగునీరు అందించిన మహానుభావుడన్నారు. చెన్నైలో కూడా దుర్భిక్ష ప్రాంతాలకు గొంతు తడిపిన మహా వ్యక్తి అని ప్రశంసించారు.
బాబుకు వెంకటేశ్వరుడి ఆశీస్సులు: ఉమ
ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు డ్యాంను మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం సందర్శించారు. రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు యజ్ఞానికి వేంకటేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పారు. ప్రతి ఏటా రూ.10వేల కోట్లతో సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తామన్నారు.