పాన్ ఇండియా మూవీ..అబ్దుల్ కలాంగా అలీ: బయోపిక్ ఫస్ట్లుక్: త్వరలో సెట్స్ మీదికి: కేంద్రమంత్రి!
Recommended Video
న్యూఢిల్లీ: మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం జీవిత చరిత్ర తెర మీదికి రాబోతోంది. ఈ సినిమా టైటిల్ ఏపీజే అబ్దుల్ కలాం. బయోపిక్ ఆఫ్ పీపుల్స్ ప్రెసిడెంట్.. అనేది ఈ మూవీ ట్యాగ్లైన్. త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోందీ సినిమా. అబ్దుల్ కలాం పాత్రలో స్టార్ కమేడియన్ అలీ నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది ఈ మూవీ. ఈ సినిమా ఫస్ట్లుక్ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ఆవిష్కరించారు.
అలీ, బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మధుర్ భండార్కర్, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్ రామచంద్రరావులతో కలిసి న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో ఈ ఫస్ట్లుక్ పోస్టర్ను ప్రకాశ్ జవదేకర్ ఆవిష్కరించారు. జగదీష్ దనేటి, సువర్ణ పప్పు, జాన్ మార్టిన్ సంయుక్తంగా ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు. జగదీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అబ్దుల్ కలాం జీవిత చరిత్రను దేశ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. రామేశ్వరం, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించబోతున్నామని అన్నారు. విద్యాభ్యాసం నుంచి రాష్ట్రపతి పదవిని అందుకునేంత వరకూ అబ్దుల్ కలాం సాగించిన ప్రయాణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నట్లు చెప్పారు.
ఇలాంటి సినిమా కోసం తాను ఎదురు చూస్తున్నానని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. చాలామంది జీవిత చరిత్రపై సినిమాలు వస్తున్నాయని, అబ్దుల్ కలాం బయోపిక్ రావాలని తాను కోరుకున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. భారత సంతతికి చెందిన హాలీవుడ్ దర్శకుడు జగదీష్ దనేటి, టైటానిక్ మూవీకి పనిచేసిన జాన్ మార్టిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి ముందుకు రావడం హర్షణీయమని అన్నారు.