హోదాపై మరోసారి కేంద్రమంత్రి వ్యాఖ్య, ముద్రగడకు బోండ ప్రశ్నల వర్షం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని ఆయన సోమవారం తెలిపారు. ఏపీకి చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటిని తాము నెరవేర్చుతామని చెప్పారు.
ఇప్పటికే ఐపికి అయిదు ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన కుంభకోణాల నుంచి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బీజేపీ ప్రభుత్వం నడుం బిగించిందని చెప్పారు. ప్రస్తుతం తమ ప్రభుత్వానికి అవినీతి మరక లేదన్నారు.
ముద్రగడకు బోండా ఉమ ప్రశ్నల వర్షం
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 వేల కాపు ఓట్లున్న నియోజకవర్గంలో కేవలం 8 వేల ఓట్లు సాధించిన ముద్రగడ కాపు ఉద్యమనేత ఎలా అవుతారని ప్రశ్నించారు.
ఆయనను సొంత నియోజకవర్గంలోనే కాపులే నమ్మలేదన్నారు. కాపు రిజర్వేషన్లపై ముద్రగడకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా కలవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబును అని, కానీ కలవాల్సింది ప్రతిపక్ష నేతలను కాదన్నారు. ప్రతిపక్ష నేతలు నిర్ణయాలు తీసుకోరన్న విషయం ముద్రగడ తెలుసుకోవాలన్నారు.
కాపులను అడ్డు పెట్టుకొని ముద్రగడ పద్మనాభం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పైన ఆయన కక్ష కట్టినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వంపై కక్ష కట్టి అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. ముద్రగడ మంజనాథ కమిషన్ను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ముద్రగడ చర్యలతో కాపులకు నష్టమన్నారు.