పవన్ కల్యాణ్ ఊసరవెల్లి -బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ -వెయ్యి జన్మలెత్తినా ఆయనలా కాలేరు: ప్రకాశ్ రాజ్
సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంగ్రామం హోరాహోరీగా సాగుతోంది. ఈసారి కూడా అధకారం తమదేనని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నా.. దుబ్బాక గెలుపు తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్న బీజేపీకి గ్రేటర్ లో అడ్డుకట్టవేసేలా వ్యూహాలను రచిస్తోంది. అందులో గులాబీ దళం.. ప్రముఖ సినీ తారల మద్దతునూ కూడగడుతున్నది. ఆ క్రమంలోనే వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ రంగంలోకి దిగారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార తీరు, రాబోయే ఫలితాలపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. గ్రేటర్ బరి నుంచి తప్పుకున్న పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజధానిపై బీజేపీ భారీ మెలిక -పవన్ వత్తాసు -'జగనన్నతోడు', వీసీల భర్తీ కథ తెలుసా: ఎంపీ రఘురామ
చిచ్చులు పెట్టడమే స్ట్రాటజీ..
ప్రజల మధ్య చిచ్చులు పెట్టడమే స్ట్రాటజీగా హైదరాబాద్ను దోచుకునేందుకే బీజేపీ నేతలు వంతుల వారీగా నగరానికి వస్తున్నారని, హిందూ-ముస్లిం గొడవలు తప్ప.. అభివృద్ధి గురించి బీజేపీకి పట్టదని ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీల వల్ల దేశానికి తీరని నష్టం వాటిల్లిందన్నారు. బీజేపీ తీరు ఇలా ఉంటే, ఆ పార్టీకి స్నేహితుడిగా చెప్పుకుంటోన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పరిస్థితి ఇంకాస్త అగమ్యగోచరంగా ఉందని ప్రకాశ్ రాజ్ అన్నారు..
వేరే పార్టీకి ఓటు వేయమంటాడా?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిని ప్రకాశ్ రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఒక పార్టీకి అధ్యక్షుడు అయిఉండి, వేరొక పార్టీని భుజాలకు ఎత్తుకోవడం ఎందుకని ఎద్దేవా చేశారు. పవన్ నిర్ణయంతో జనసేన కార్యకర్తలతోపాటు వ్యక్తిగతంగా తాను కూడా నిరుత్సాహానికి గురయ్యానని ప్రకాశ్ రాజ్ అన్నారు. అంతటితో ఆగకుండా..
పవన్ ఊసరవెల్లి..
‘‘పవన్ కల్యాణ్ కు ఏమైందో నిజంగా అర్థం కావట్లేదు. తానొక నాయకుణ్ణని, జనసేన పార్టీ ఉందనే సోయితో ఆయన వ్యవహరిస్తున్నట్లు లేదు. ఎన్నికల నుంచి అభ్యర్థుల్ని విత్ డ్రా చేసుకుని, వేరొక పార్టీకి ఓటేయాలని ఎలా చెబుతాడు? అసలు జనసేన ఓట్ షేరెంత? బీజేపీ ఓట్ షేర్ ఎంత? పవన్ బీజేపీ భుజాలెక్కడమేంటి? 2014లో మోదీని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు.. కొద్ది కాలానికే ప్రధాని ద్రోహం చేశారని తిట్టిపోశారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి, మళ్లీ కలిసిపోయి.. మోదీని మించిన నాయకుడు లేరని ప్రకటనలు చేస్తున్నారు. అసలు ఇన్ని సార్టు స్టాండ్ మార్చుకున్నారంటే పవన్ కచ్చితంగా ఊసరవెల్లి అయిఉండాలి'' అని ప్రకాశ్ రాజ్ విమర్శించారు.
బీజేపీకి రిటర్న్ గిఫ్ట్..
ఏ కోణం నుంచి చూసినా గ్రేటర్ ప్రజలు కేసీఆర్ కే మద్దతు తెలపాలని, వైరస్లా.. దొంగల్లా.. నగరానికి వస్తున్న బీజేపీ నేతలకు ఇక్కడి ప్రజలే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్రకాశ్ రాజ్ కోరారు. చివరికి తేజస్వి లాంటివాళ్లు కూడా కేసీఆర్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని, ఇంకో వెయ్యి జన్మలెత్తినా ఎవరూ కేసీఆర్ స్థాయికి రాలేరని ప్రకాశ్ రాజ్ అన్నారు. 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీకి డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది.
#BoycottFood:టాప్ట్రెండింగ్ - రైతులతో లింకేంటి? ఎవరు నడిపిస్తున్నారు? ఇదీ అసలు కథ..