ఎన్టీఆర్ దైవం, ఎన్నార్ మెంబర్: నాగ్కు ప్రణబ్ సందేశం
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు వారి ఇంట ఆరాధ్య దైవం అయితే అక్కినేని నాగేశ్వర రావు తెలుగు వారి ఇంట సభ్యుడయ్యారు! ఎన్టీఆర్, అక్కినేనిలు పలు ఆధ్యాత్మిక చిత్రాలతో పాటు సామాజిక సినిమాలలోను నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా చెన్నైలో ఉన్నప్పుడు హైదరాబాదుకు తరలి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అక్కినేని అని అందరు గుర్తు చేసుకుంటున్నారు.
ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అంత్యక్రియలు జరగనున్నాయి. సిని, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ... ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ ప్రతి ఇంట ఆరాధ్య దైవం అయ్యారని, అక్కినేని ఫ్యామిలీ మెంబర్ అయ్యారన్నారు. తాను మానకసి ప్రశాంతత కోసం అప్పుడప్పుడు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి వెళ్తానని చెప్పారు.
కాగా, అక్కినేని మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లు సంతాపం తెలిపారు. సినీ పరిశ్రమ ఓ సృజనాత్మక వ్యక్తిని కోల్పోయిందని ప్రణబ్ అన్నారు. రాష్ట్రపతి అక్కినేని తనయుడు నాగార్జునకు సంతాప సందేశం పంపించారు. అక్కినేని చిత్రాలు చిరస్మరణీయమని, అయనను ఎప్పటికీ మరువలేమని ఆ సందేశంలో పేర్కొన్నారు. భారత సినీ పరిశ్రమకు, ప్రత్యకంగా తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు.
అక్కినేని అనంత లోకాలకు వెళ్లారన్న వార్త తనను ఎంతో బాధించిందని, ఆయన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సినీ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.