'లవ్ యూ' అంటూ అమ్మాయి మెసేజ్ : తన్నుకు చచ్చిన రెండు గ్రామాలు
విల్లిపురం : సరదా పేరుతో చేసే కొన్ని మతిలేని చేష్టలు చివరాఖరికి విషాదాంతాలుగా మిగిలిపోతాయి. చేసినవాళ్లకు సరదాగానే అనిపించినా.. దానికి బలైపోయేది మాత్రం ఎదుటి వ్యక్తులే. తాజాగా తమిళనాడులోని విల్లిపురంలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ పదిహేనేళ్ల అమ్మాయి చేసిన ఆకతాయి పని.. ఏకంగా రెండు గ్రామాల మధ్య రణరంగానికి దారితీసింది.
విషయమేంటంటే.. విల్లిపురంకు చెందిన ఓ అమ్మాయి(15) తన పొరుగింట్లో ఉండే ఓ నలభయ్యేళ్ల మహిళ మొబైల్ను ఆకతాయి పనికోసం ఉపయోగించింది. ఆమెకు తెలియకుండా 'ఐ లవ్ యూ' అని మెసేజ్ టైప్ చేసి తన బంధువైన గోపీనాథ్ కు పంపించింది. అంతే.. అక్కడితో అసలు పంచాయితీ మొదలైంది. మెసేజ్ చూసుకున్న గోపీనాథ్ తరుచూ మహిళకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు.
ఆ మెసేజ్ పంపించింది తాను కాదని ఎన్నిసార్లు చెప్పినా.. అతడు మాత్రం ఫోన్ చేసి విసిగించడం మానుకోలేదు. పైగా.. ఫోన్ చేసిన ప్రతీసారి అసభ్యకర రీతిలో మాట్లాడుతుండడంతో విషయాన్ని తన బంధువైన అయ్యప్పన్ (18)కు వివరించింది ఆ మహిళ. దీంతో అయ్యప్పన్ గోపినాథ్ కు ఫోన్ లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. అతను పట్టించుకోలేదు.
ఇక చేసేదేమి లేక తన నలుగురు మిత్రులను వెంటబెట్టుకుని గోపినాథ్ ఉండే మున్నియన్ పెట్టయ్ ప్రాంతానికి వెళ్లాడు. విషయాన్ని అక్కడి పెద్దలకు వివరించడంతో.. గోపినాథ్ కు నచ్చజెబుతామని స్థానికులు హామి ఇచ్చారు. విషయం స్థానిక పెద్దల దాకా వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన గోపినాథ్.. ఐదుగురు మిత్రులను వెంటబెట్టుకుని అయ్యప్పన్ బృందాన్ని వెంబడించాడు.
ఈ క్రమంలో అయ్యప్పన్-గోపినాథ్ వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో.. అయ్యప్పన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని సమీపంలోని పాండిచ్చేరి ఆసుపత్రిలో చేర్పించారు. అయ్యప్పన్ పై దాడితో రగిలిపోయిన విల్లిపురం గ్రామస్తులు మున్నియన్పెట్టయ్ వెళ్లి గోపినాథ్ పై దాడికి యత్నించారు. ఇంతలో అక్కడి గ్రామస్తులంతా గోపినాథ్ వైపే నిలబడి అయ్యప్పన్ తరుపున వెళ్లిన విల్లిపురం గ్రామస్తులపై దాడి చేశారు.
ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్ర ఘర్షణకు దారితీయడంతో.. పోలీసులు రంగప్రవేశం చేశారు. అయ్యప్పన్-గోపినాథ్ వర్గీయులను శాంతింపజేసి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఒక చిన్న మెసేజ్ తో ఇంతటి గొడవకు కారణమైన ఆ అమ్మాయిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.