ఇంఛార్జి డిజిపిగా ప్రసాద రావు నియమిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్ర ఇంఛార్జి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి)గా ప్రసాద రావును నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మినెంట్ డిజిపి కోసం యూపిఎస్సీ నుంచి నియామక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అప్పటి వరకు ఇంఛార్జిగా ప్రసాద రావు బాధ్యతలు నిర్వహిస్తారు.
దినేష్ రెడ్డి ఈ రోజు డిజిపిగా పదవీ విరణ చేసిన విషయం తెలిసిందే. దినేష్ రెడ్డి తర్వాత ప్రసాద రావు సహా పలువురి పేర్లు లిస్టులో ఉన్నాయి. అందులో ప్రసాద రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆయననే ప్రభుత్వం ఇంఛార్జి డిజిపిగా నియమించింది.
1979 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన ప్రసాద రావు ప్రస్తుతం ఆయన ఎసిబి డిజిగా పని చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ సిపిగా ఆయన పని చేశారు. ఆయన పదవీ విరమణకు మరో రెండేళ్ల సమయం ఉంది. సోమవారం ఉదయం ప్రసాద రావు సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.
గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద రావు తొలి ప్రయత్నంలోనే ఐపిఎస్కు ఎంపికయ్యారు. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఎస్పీగా, విశాఖ సిపిగా, ఏలూరు, కర్నూలు డిఐజిగా పని చేశారు.