చంద్రబాబు మనవడితో మోడీ ముచ్చట్లకే: నల్లపురెడ్డి, ప్రధానిపై గల్లా జయదేవ్ అసంతృప్తి
నెల్లూరు/ గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే ప్రధాని నరేండ్రమ ోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్లుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారంనాడు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్లమెంటు నుంచి మట్టి తెచ్చి ఆంధ్ర ప్రజల ముఖాన కొట్టి ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండా మోసం చేశారని ఆయన ఆయన ప్రధానిని తప్పు పట్టారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారని ఆయన అన్నారు.
ప్రధాని అమరావతి పర్యటనపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఏ విధమైన ప్యాకేజీలు ప్రకటించకపోవడంతో కొంత అసంతృప్తి చెందారని ఆయన శుక్రవారంనాడు అన్నారు.
ప్రధాని ప్యాకేజీ ప్రకటించకపోవడంపై అసంతృప్తి చెందినవారిలో తానొక్కడినని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఎపికి కేంద్రం మెరుగైన ప్యాకేజీలు ఇస్తుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. కేంద్రంతో మాట్లాడి భారీ ప్యాకేజీలు రాబట్టేందుకు తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా భావోద్వేగ అంశంగా మారిందని, దీనికోసం మిత్రపక్షంగా ఉండి కేంద్రంతో పోరాడలేమని జయదేవ్ అన్నారు. ప్రత్యేక హోదా రానప్పుడు రాష్ర్టానికి ఏం సాధించుకోవాలన్న దానిపై అవగాహన ఉండాలన్నారు. ఈ విషయంపై మరోసారి సీఎంతో కలిసి ప్రధానితో చర్చిస్తామని స్పష్టం చేశారు.
తాను తీసుకువచ్చిన తెనాలి కేంద్రీయ వర్శిటీని తామే తెచ్చామని ఇతరులు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. శిలాఫలకంపై కేసీఆర్ పేరు వేయడంలో తప్పు లేదన్న జయదేవ్ స్థానిక సర్పంచి, ఎమ్మెల్యే, ఎంపీలను ఎందుకు విస్మరించారో తెలియదన్నారు.