పికే అమ్ముల పొదిలో షర్మిల అస్త్రం: జగన్ ప్రయోగిస్తారా?
వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. ప్రశాంత్ కిశోర్ నిర్ణయాన్ని బట్టే ఆమె నిర్వహించే పాత్ర ఉంటుందని అంటున్నారు.
హైదరాబాద్: చాలా కాలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెర మీదికి వచ్చారు. ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆమె ప్రసంగించారు కూడా.
జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా ప్లీనరీకి హాజరై సందేశమిచ్చారు. దాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున షర్మిలతో పాటు విజయమ్మ కీలక పాత్ర పోషిస్తారనేది అర్థమవుతోంది. ప్రశాంత్ కిశోర్ సూచన మేరకే తిరిగి వారిద్దరినీ జగన్ తెర మీదికి తెచ్చారని అంటున్నారు.
గత ఎన్నికల్లో తల్లి విజయమ్మను విశాఖపట్నం పార్లమెంటు సీటుకు పోటీ చేయించిన జగన్ సోదరి షర్మిలను ఎన్నికల బరిలోకి దింపలేదు. ఆ తర్వాత తెలంగాణలో షర్మిల పాదయాత్రలు చేసినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు.
ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లే....
వచ్చే ఎన్నికల్లో షర్మిల ఏ విధమైన పాత్ర పోషించాలనేది ప్రశాంత్ కిశోర్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఆమె క్రియాశీలకంగా ఉండడం మాత్రం ఖాయం. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారా, చేస్తే అసెంబ్లీకా... పార్లమెంటుకా, ఏ సీటు నుంచి పోటీకి దిగుతారు, ఎన్నికల ప్రచార సారథ్యం వహిస్తారా అనే ప్రశ్నలకు జవాబు దొరకాల్సింది. అదంతా ప్రశాంత్ కిశోర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
విజయమ్మ కూడా....
వచ్చే ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆమె పాత్రను కూడా ప్రశాంత్ కిశోర్ నిర్ణయిస్తారని అంటున్నారు. ఏం పోటీ చేస్తారా, లేదా అనేది కూడా ఆయన నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. షర్మిల, విజయమ్మల్లో ఒకరు పోటీ, వేరొకరు ప్రచారం చేయడానికి పరిమితం కావచ్చునని అంటున్నారు. ఈ విషయంలో ప్రశాంత్ కిశోర్ ఏ విధమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది ఆసక్తికరమైన విషయమే.
వైఎస్ వివేకాను వదిలేసినట్లేనా.....
బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని జగన్ వదిలేసినట్లేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇటీవలి ప్లీనరీలో వివేకా పేరు కూడా వినిపించలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి బిటెక్ రవి చేతిలో ఓడిపోయారు. వైయస్ కుటుంబానికి పెట్టిన కోటగా ఉన్న స్థానంలో వివేకా ఓటమి జగన్కు ఇంకా మింగుడు పడడం లేదని అంటున్నారు.
జగన్ ప్లస్ ప్రశాంత్ కిశోర్
వచ్చే ఎన్నికల్లో వ్యూహరచన ప్రశాంత్ కిశోర్ది అయితే జగన్ది యాక్షన్ అనే విషయం ఇప్పటికే తెలిసిపోయింది. విజయమ్మను, షర్మిలను వచ్చే ఎన్నికల్లో ఎలా వాడుకుంటారు, వారు నిర్వహించాల్సిన పాత్రను ఎలా నిర్ణయిస్తారనేది తేలాల్సి ఉంది. క్రమంగా విజయమ్మ, షర్మిల క్రియాశీలక పాత్రల్లోకి రావచ్చుననే మాట వినిపిస్తోంది. పార్టీలో రెండో పవర్ సెంటర్ తయారవుతుందనే ఉద్దేశంతోనే షర్మిలను జగన్ పక్కన పెట్టారనే విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడానికైనా షర్మిలను జగన్ రంగం మీదికి తెస్తారని అంటున్నారు.