జగన్ పార్టీకి దూరమవుతున్న పీకే! ఆ ఎంపీ, జగన్ బంధువులే కారణమా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్) ఛైర్మన్ ప్రశాంత్ కిషోర్ దూరమవుతున్నారా? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. ఇందుకు వైసీపీకి చెందిన ఓ పార్లమెంటు సభ్యుడే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ వ్యూహకర్తగా నియమించుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, పార్టీలోని సీనియర్ నేతల కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది.
జగన్ పార్టీకి దూరంగా పీకే
అయితే, గత కొంత కాలంగా ప్రశాంత్ కిషోర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికంతటికీ కారణం వైసీపీ ఎంపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో ఎంత వరకు వాస్తవముందో తెలియాల్సి ఉంది.
టీఆర్ఎస్ ఎంపీలకు చేతులెత్తి దండం పెట్టినా..: వైవీ ఆవేదన, ‘పొలిటికల్ గేమ్'
విజయసాయి వల్లే..
కాగా, వైసీపీకి దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్... వైసీపీ బాధ్యతలను తన ప్రధాన అనుచరుడు రిషీకి అప్పగించారనే ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా వెళ్తున్న పీకే.. బీజేపీకి వైసీపీని దగ్గర చేయాలని భావించారట. పీకే చెబుతున్న సలహాలను అమలు చేయాలని జగన్ చెబుతున్నప్పటికీ.. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో పని చేసే పీకే అనుచరులు వాటిని అమలు చేయలేకపోతున్నారట.
పనిచేయలేకపోతున్న పీకే టీం?
విజయసాయిరెడ్డి జోక్యం, ఆధిపత్యం పెరిగిపోవడంతో... పీకే టీంలోని ఒక్కొక్కరు ఐప్యాక్కు రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీకేతో పాటు, రిషిని కూడా విజయసాయిరెడ్డితో పాటు, జగన్ బంధువులు ఇద్దరు లెక్కచేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వీరితో సమావేశం అంటేనే పీకే టీం కొంత ఆందోళన చెందుతుందనే ప్రచారం సాగుతోంది.
అందుకే పీకే దూరం
అంతేగాక, ఈ ముగ్గురికీ రాజకీయాలపై పూర్తి అవగాహన లేదని, వీరి వల్ల పీకే ఇమేజ్కు డ్యామేజ్ జరుగుతుందని ఐప్యాక్ కు సమాచారం ఇచ్చారని తెలిసింది. ప్రత్యేక హోదా విషయంలో పీకే ఇచ్చిన సలహాలను కూడా వీరు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దూరమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై పార్టీ వర్గాలు గానీ, పీకే గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.