ప్రశాంత్ కిషోర్ కే షాకిచ్చిన ఐప్యాక్ టీమ్- వైసీపీ, టీడీపీ కోసం ప్రత్యర్ధులుగా- గురువుకే ఝలక్...
దేశ రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ కు ఆయన టీమ్ సభ్యులే షాకిచ్చారంటూ నమ్మగలమా ? ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలనే ఆయనతో విడిపోయి రాజకీయ పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ వారు అమలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఇదంతా అంతిమంగా కార్పోరేట్ వ్యూహంగా మిగిలిపోతున్న తరుణంలో తాజాగా తెలుగు మీడియాలో వచ్చిన ఓ వార్తకు కౌంటర్ గా ఐ ప్యాక్ ఇచ్చిన వివరణతో ఇది బట్టబయలైంది. మేటి వ్యూహకర్త వ్యూహాలకే అందకుండా వారు అమలు చేస్తున్న స్ట్రాటజీ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఐప్యాక్ వ్యూహం అమలు...
2014లో మోడీని ప్రధానిగా చేయడంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతుందో తెలియదు కానీ 2019లో వైసీపీని ఏపీలో కనీవినీ ఎరుగని మెజారిటీ దిశగా నడిపించడంలో మాత్రం ఆయన వ్యూహాలు పాదరసంగా పనిచేశాయని కచ్చితంగా చెప్పక తప్పదు. ముఖ్యంగా ప్రత్యర్ధి కదలికలతో పాటు వారి వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగట్టడం, వాటికి ప్రతివ్యూహాలు రచించడం, వాటిని క్షేత్రస్ధాయిలో తూచా తప్పకుండా అమలు చేయడం, తమను నమ్ముకున్న వారి బలహీనతను సైతం బలంగా మార్చి చూపించడం.. ఇలా ఒకటేమిటి ప్రశాంత్ రచించని వ్యూహాలు లేవు. దీంతో తమకు అప్పగించిన పనిని ఏపీలో ప్రశాంత్ కిషోర్ టీమ్ ఐప్యాక్ అక్షరాలా చేసి చూపించింది.
వైసీపీ, టీడీపీలను చదివేసిన ఐప్యాక్...
2019 ఎన్నికల నాటికి ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ రెండింటి బలాలు, బలహీనతలను పూర్తిగా అధ్యయనం చేయడంలో ఐ ప్యాక్ టీమ్ ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. క్షేత్రస్ధాయిలో వీరి బలాలను, బలహీనతలను ఎలా తీసుకెళ్తే ఎవరిని గెలిపించవచ్చు, ఎవరిని ఓడించవచ్చనేది ఐప్యాక్ పూర్తిగా ఔపోసన పట్టేసింది. దీన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా తాము కాంట్రాక్టు కుదుర్చుకున్న వైసీపీని చరిత్రలో కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగింది. వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించిన తర్వాత తమ పని పూర్తయినట్లుగా ఐప్యాక్ భావించింది.
అసలు కథ మెదలైందిలా....
అంతవరకూ బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. సహజంగానే ఓ రాష్ట్రంలో పని పూర్తవగానే మరో రాష్ట్రానికి షిఫ్ట్ అయి పోయే ప్రశాంత్ టీమ్... ఈసారి కూడా వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. కానీ ప్రభుత్వ పాలన కొత్త కావడం, క్షేత్రస్ధాయిలో సమస్యలు తెలుసుకోవాలన్న పట్టుదల వంటి కారణాలతో జగన్ ... తనకు అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ కు మరో అవకాశం ఇవ్వాలని భావించారు. కానీ అది జరగలేదు. ప్రశాంత్ రాజకీయ వ్యూహాలు వేరేగా ఉండటం, నేరుగా ప్రభుత్వానికి సాయం చేసే ప్రయత్నం తనకూ కొత్త కావడం వంటి అంశాలతో ప్రశాంత్ జగన్ ఇచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయారు. కానీ ఆయన టీమ్ మాత్రం వెళ్లేందుకు సిద్ఘంగా లేదు. దీంతో అసలు కథ ప్రారంభమైంది.
వైసీపీ, టీడీపీకి విడిపోయి....
ఏపీ రాజకీయాలను అప్పటికే పూర్తిగా అధ్యయనం చేసేసిన ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీమ్ సభ్యులు తమ కార్యక్షేత్రంలో పని ముగిసిపోవడంతో ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. వీరిలో చాలా మంది ఏపీతో ఏదో రకంగా సన్నిహిత సంబంధాలు ఉన్న వారే కావడంతో ప్రశాంత్ టీమ్ నుంచి బయటికి వచ్చి వేర్వేరు దుకాణాలు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక అడ్డేముంది ఐప్యాక్ సంస్ధకు రాజీనామాలు సమర్పించి బయటికి వచ్చేశారు. ఇక స్వేచ్ఛగా వైసీపీ, టీడీపీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో విపక్షంలో ఉన్న టీడీపీని అధికారంలోకి తెచ్చేలా కొందరు, వైసీపీ ప్రభుత్వానికి క్షేత్రస్దాయిలో అండదండలు అందిస్తూ వచ్చే ఎన్నికల్లోనూ అధికారం దిశగా నడిపించేలా మరికొందరు ఒప్పందాలు చేసుకున్నారు. టీడీపీకి రాబిన్ శర్మ టీమ్, వైసీపీకి దినేష్ నేతృత్వం వహించారు.
పీకేకు షాక్- జగన్ తో ఒప్పందాలు...
టీడీపీతో రాబిన్ శర్మ కుదుర్చుకున్న ఒప్పందం మాట ఎలా ఉన్నా.. అధికార పార్టీ అయిన వైసీపీతో, అప్పటికే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన ప్రశాంత్ కిషోర్ టీమ్ అయి ఉండి దినేష్ బృందం వ్యవహరించిన తీరు గురువు ప్రశాంత్ కిషోర్ కే షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్ ముందుగా కంగుతిన్నా... ఆ తర్వాత సరేలే అనుకుని వదిలేశారు. దీంతో గ్రామస్దాయిలో ఏపీ ప్రభుత్వానికి సహకరించేలా దినేష్ టీమ్ పీకే కార్పోరేట్ సొల్యూషన్స్ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేసుకుని ముందుకెళుతోంది. ఇక్కడ గురువుకు ఝలక్ ఇచ్చినా టీమ్ పేరులో మాత్రం పీక్ ను కూడా వాడుకున్నారు. ఇప్పుడు ఈ సంస్ధ ఏపీలో గ్రామ వాలంటీర్ల వ్యవస్ధకు సహకరిస్తూ దాన్ని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి బలంగా మారేలా కృషి చేస్తోంది.
వైసీపీ, టీడీపీ కోసం ప్రత్యర్ధులుగా...
ఈ వ్యవహారమంతా తెలియని కొన్ని మీడియా సంస్ధలు జగన్ వైసీపీని అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిషోర్ టీమ్ ఐప్యాక్ కు గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ అజమాయిషీని కట్టబెట్టేశారని, ప్రభుత్వ సొమ్ముతో పార్టీని బలోపేతం చేసుకుంటున్నారని రాసేసింది. చివరికి ఐ ప్యాక్ స్పందించి ఏపీలో ప్రస్తుతం తాము ఏ ప్రాజెక్టులోనూ భాగస్వాములుగా లేమని నిన్న ఓ వివరణ ఇవ్వడంతో వీరంతా నాలుక కరుచుకున్నారు. అంటే వైసీపీని గెలిపించిన ఐప్యాక్ టీమ్ సభ్యులే గురువు పీకేను కాదని వైసీపీ, టీడీపీలతో వ్యక్తిగతంగా ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చే ఎన్నికల నాటికి ఆయా పార్టీలను గెలిపించే బాధ్యతలు చేపట్టారన్నమాట. మరో రకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ పాత టీమ్ సభ్యులు రెండుగా విడిపోయి వైసీపీ, టీడీపీలను 2024లో గెలిపించేందుకు పోటీ పడుతున్నారన్నమాట.