జగన్తో పీకే భేటీ-విగ్రహాల రాజకీయానికి కౌంటర్, తిరుపతిపై చర్చ-అంతా సీక్రెట్గా
ఏపీలో విగ్రహాల రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడంతో తన ప్రమేయం లేకపోయినా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికి తోడు విపక్షాలు సీఎం జగన్, హోంమంత్రి, డీజీపీ క్రైస్తవులే అని వారిని మతాల పేరుతో టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సీఎం జగన్ తన పాత మిత్రుడు, ఒకప్పటి వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం కోరినట్లు తెలుస్తోంది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన పీకే... దాదాపు మూడు గంటల పాటు ఆయనతో భేటీ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా పరిస్ధితులపై వీరిద్దరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
విగ్రహాల రాజకీయంతో జగన్ ఉక్కిరిబిక్కిరి
ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మతం పేరుతో టార్గెట్ చేస్తున్నాయి. ఏకంగా సీఎంతో పాటు ప్రభుత్వంలో కీలక వ్యక్తులపై మతం ముద్ర వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ విగ్రహం కూలినా సీఎం జగన్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి. దీంతో ప్రజల్లోకి సైతం తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్ధితి ఇప్పుడు ప్రభుత్వంలో కనిపించడం లేదు. మత సామరస్యం దెబ్బతినకుండా కమిటీలు వేసినా, ఆలయాల పునర్నిర్మాణం హామీ ఇచ్చినా, ఆలయ ఘటనలపై సీబీఐ, సీఐడీ విచారణలు వేసినా సర్కారు మాత్రం ఈ వివాదాల్లో నుంచి బయటపడలేకపోతోంది.
ప్రశాంత్ కిషోర్ సాయం కోరిన జగన్ ?
రెండేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఊహించని రీతిలో ఘనవిజయం అందించిన అనుభవం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు ఉంది. వైసీపీకి ఆ ఎన్నికల్లో పీకే అందించిన సాయం మర్చిపోలేనిది. సీఎం జగన్ సైతం ఊహించని రీతిలో ఆయనకు ఘనవిజయం కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ సేవల్ని మరోసారి వాడుకోవాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విగ్రహాల రాజకీయంతో విపక్షాలు చేస్తున్న దాడిని అడ్డుకునేందుకు పీకేనే తగిన వ్యక్తి అని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు క్షేత్రస్దాయిలో వ్యూహాలను పకడ్బందీగా అమలు చేసే సత్తా ఉన్న పీకే సాయం తీసుకోవడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్కాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్తో ప్రశాంత్ కిషోర్ భేటీ
ఇవాళ ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రశాంత్ కిషోర్ నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. పీకే పర్యటనను ప్రభుత్వం పూర్తి రహస్యంగా ఉంచినట్లు సమాచారం. నిఘా వర్గాల సమాచారం మేరకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్నవరం వచ్చిన పీకే.. అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ వాహనంలోనే తాడేపల్లి వెళ్లి జగన్తో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరూ రాష్ట్రంలో తాజా ఘటనలతో పాటు త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికపైనా చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ జగన్తోనే ఉన్న పీకే అనంతరం.. తిరిగి గన్నవరం బయలుదేరి వెళ్లిపోయినట్లు సమాచారం.
విగ్రహాల రాజకీయానికి కౌంటర్ వ్యూహం
రాష్ట్రంలో ఆలయాల ఘటనలను అడ్డుపెట్టుకుని విపక్షాలు చేస్తున్న విగ్రహాల రాజకీయానికి కౌంటర్ ఇచ్చే వ్యూహంపై జగన్, ప్రశాంత్ కిషోర్ చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా జనం తాజా వ్యవహారంపై ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడం, వారికి ఊరటనిచ్చేలా, విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా కొత్త వ్యూహాల రూపకల్పన వంటి అంశాలు వీరిద్దరి చర్చలో మాట్లాడుకుని ఉండొచ్చని తెలుస్తోంది. వీరిద్దరి భేటీలో ఏం మాట్లాడుకున్నారో స్పష్టంగా తెలియకపోయినా... విగ్రహాల రాజకీయం తిరుపతి ఉపఎన్నికపై ప్రభావం చూపకుండా ఉండేందుకు అమలు చేయాల్సిన వ్యూహంపై మాత్రం చర్చించి ఉండొచ్చని తెలుస్తోంది.