పాదయాత్రపై డైలమా: జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ తాజా ప్లాన్ ఇదీ
2019 ఎన్నికలకు వైసీపీ సన్నద్దమౌతోంది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని పదిమంది వైసీపీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సన్నాహలు చేస్తున్నారు.
అమరావతి: 2019 ఎన్నికలకు వైసీపీ సన్నద్దమౌతోంది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని పదిమంది వైసీపీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సన్నాహలు చేస్తున్నారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేలా ఆ పార్టీ నేతలు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ నివేదికను పార్టీ అధినేత వైఎస్ జగన్కు నివేదిక ఇచ్చారని సమాచారం.
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్న వైసీపీ ... 2019 ఎన్నికల్లో విజయం కోసం చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తోంది. పోలింగ్ బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ అధినేత జగన్కు సూచించారు.
2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ చీఫ్ జగన్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పాదయాత్ర నిర్వహణ గురించి జగన్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే జగన్పై కోర్టు కేసులున్నాయి. దీంతో పాదయాత్ర నిలిచిపోకుండా పాదయాత్ర కొనసాగించాలంటే ఏం చేయాలనే దానిపై కూడ ఆ పార్టీ నాయకత్వం చర్చిస్తోంది.
పాదయాత్రపై న్యాయనిపుణులతో చర్చలు
ఈ ఏడాది అక్టోబర్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ పాదయాత్ర ద్వారా టిడిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగట్టాలని భావిస్తోంది వైసీపీ. అయితే ప్రతి శుక్రవారం నాడు వైసీపీ చీఫ్ జగన్ కోర్టుకు హజరుకావాల్సిన పరిస్థితులున్నాయి. కోర్టుకు హజరుకావడంపై మినహయింపు విషయమై వైసీపీ వర్గాలు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అయితే పాదయాత్రకు వారంలో ఒకరోజు పాటు కోర్టు వాయిదాలకు విరామం ఇస్తే టీడీపీ నేతల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
సంస్థాగత నిర్మాణం లేకపోవడమే వైసీపీకి నష్టం
నంద్యాల, కాకినాడ ఫలితాలను సుదీర్ఘంగా విశ్లేషించి తన బృందాలతో నివేదికలను తెప్పించిన ప్రశాంత్ కిషోర్, ఏపీలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ ఓ రిపోర్టును జగన్కు అందించారు. పార్టీకి అంతర్గత నిర్మాణం లేకపోవడమే పెద్ద మైనస్గా తేల్చారని సమాచారం. పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
పోలింగ్ బూత్ల వారీగా శిక్షణ
ఏపీలోని మొత్తం పోలింగ్ బూతులన్నింటినీ వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో కవర్ చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క బూత్ పరిధి నుంచి పది మంది చొప్పున క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేయనున్నారు.. వీరికి హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నారు. వీరంతా తమకు కేటాయించిన పోలింగ్ బూత్ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పాలనలో లోపాలు చెప్పి జగన్ ప్రకటించిన నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు..
వైఎస్ఆర్ కుటుంబంలో కోటి మందిని భాగస్వామ్యం
వైఎఆర్ కుటుంబం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే పార్టీకి మంచి ఫలితాలు రానున్నాయని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో కోటిమందికి భాగస్వామ్యం కల్పించాలని వైసీపీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తే పాదయాత్రను కూడ సక్సెస్ చేయవచ్చనే అభిప్రాయంలో పార్టీ నాయకత్వం ఉంది.