జనసేన కోసం పీకే టీమ్ ? పార్టీ భవిష్యత్తు, పవన్ పై సర్వే- త్వరలో భవిష్యత్ ప్రణాళిక..
ఏపీలో గతేడాది వైసీపీ సాధించిన విజయం ఇక్కడి రాజకీయ పార్టీలన్నింటికీ ఎన్నో పాఠాలు నేర్పింది. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో కేవలం ప్రజల వద్దకు వెళ్లి తమ పార్టీ విధానాలు చెప్పుకుంటే చాలదని, వారి సమస్యల కోసం పోరాటాలు చేస్తే సరిపోదని, ఇంకా చేయాల్సిందే ఏదో ఉందనే సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే అధికార వైసీపీతో పాటు విపక్షంలో ఉన్న టీడీపీ ఈ దిశగా గతంలో ప్రశాంత్ కిషోర్ నడిపిన ఐప్యాక్ టీమ్ లో సభ్యులు కొందరితో ఒప్పందాలు చేసుకోగా.. తాజాగా మరో పార్టీ జనసేన కూడా ఇదే కోవలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
పవన్ కోసం పీకే టీమ్...?
ప్రస్తుతం దేశంలో కాలంతో పాటే రాజకీయాలు మారిపోతున్నాయి. తమ బలాలే కాదు ప్రత్యర్ధి బలహీనతలను కూడా బలాలుగా మార్చుకునే సామర్ధ్యం ఉన్న వారే రాజకీయాల్లో రాణిస్తున్నారు. కేవలం ప్రజల చుట్టూ తిరిగి ఓట్లు వేయించుకునే రోజులు పోయాయి. జనాన్ని మేనేజ్ చేసే డబ్బులేవే వ్యూహకర్తలపై పెడితే ఫలితాలు త్వరగా వచ్చేలా ఉన్నాయి. ఏపీలో రాజకీయ పార్టీలు ఈ ఫార్ములాను అతి తక్కువ సమయంలోనే ఒంటబట్టించుకున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో గతంలో వైసీపీ భారీ విజయం వెనుక శ్రమించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ బృందంలోని సభ్యులు ఇప్పుడు గ్రూపులుగా విడిపోయి ఇక్కడి రాజకీయ పార్టీలకు అండగా నిలుస్తున్నారు. వీరి వ్యూహాలను సొమ్ముచేసుకునే క్రమంలో వైసీపీ ఇప్పటికే ముందుండగా.. టీడీపీ కూడా ఇప్పటికే ఓ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుని ముందుకెళుతోంది. తాజాగా మరో పార్టీ జనసేన కూడా మాజీ ఐప్యాక్ టీమ్ సభ్యుల్లో కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
అంతా ఆ తాను ముక్కలే...
గతంలో వైసీపీ కోసం పనిచేసిన ఐప్యాక్ టీమ్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మానసపుత్రిక. అయితే 2019 ఎన్నికల్లో తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారి బాధ్యత కూడా పూర్తయింది. దీంతో వారు వెళ్లిపోయారు. అయితే అప్పట్లో ఆ టీమ్ తరఫున పనిచేసిన వారిలో చాలా మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం, వారిలో పలువురు ఇక్కడి విభిన్న పార్టీల భావజాలాలు కలిగి ఉండటంతో సహజంగానే వాటి ఆధారంగా వీరు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. వీరిలో రాబిన్ శర్మ బృందం ఇప్పటికే టీడీపీకి పనిచేస్తుండగా.. దినేష్ బృందం వైసీపీ ప్రభుత్వం కోసం పీకే కార్పోరేట్ సొల్యూషన్స్ పేరుతో తాజాగా రంగంలోకి దిగింది. ఇదే కోవలో మరో బృందం జనసేన తరఫున పనిచేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
సర్వేతో రంగంలోకి...
ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీమ్ కు ఓ అలవాటు ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ తరఫున పనిచేసినా ముందుగా ఆ పార్టీ గురించి, దాన్ని నడిపించే వారి గురించి జనం ఏమనుకుంటున్నారనేది ఈ టీమ్ గుర్తిస్తుంది. దాని ఆధారంగానే భవిష్యత్ ప్రణాళిక సిద్దమవుతుంది. ఇదే కోవలో ఇప్పుడు మాజీ పీక్ టీమ్ సభ్యుల్లో జనసేన కోసం పనిచేస్తున్న బృందం సర్వే చేపట్టింది. ఈ సర్వేను ఏపీలో ప్రస్తుతం అంతర్గతంగా ప్రజల్లో సర్యులేట్ చేస్తున్నారు. ఇందులో జనసేన గురించి మీ అభిప్రాయం ఏమిటి, పార్టీ విజయావకాశాలు ఎలా ఉంటాయి, పవన్ పై మీ అభిప్రాయం ఏంటి ? పవన్ విజయం దిశగా వెళ్లాలంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, పవన్ కు మీరు ఇచ్చే రేటింగ్ ఎంత వంటి పలు ప్రశ్నలున్నాయి. వీటిపై ప్రజల్లో వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ముందుకెళ్లేందుకు ఈ టీమ్ సిద్ధమవుతోంది.
సర్వే ఆధారంగా భవిష్యత్ వ్యూహాలు..
ప్రస్తుతం జనసేనతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి జనం అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తర్వాత వీటి ఆధారంగా పార్టీలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు, భవిష్యత్ వ్యూహాలు ఖరారు అవుతాయని తెలుస్తోంది. అందుకే ఈ సర్వేను టీమ్ సీరియస్ గా తీసుకుంటోంది. పవన్ జనసేన తరఫున పనిచేస్తున్న టీమ్ సభ్యుల వివరాలు బయటికి రాకపోయినా వీరంతా గత పీకే టీమ్ సభ్యులే అని మాత్రం అర్ధమవుతోంది. అందుకే అచ్చం పీకే తరహా వ్యూహాలతోనే ముందుకెళ్తున్నారు. జనం నాడి పట్టకుండా జనాన్ని గెలవడం సాధ్యం కాదనే సామెతను అక్షరాలా అమలు చేస్తూ ఈ సర్వే సాగుతుండగా... దీని ఫలితాలే జనసేన భవిష్యత్ నిర్దేశించబోతున్నాయని కూడా తెలుస్తోంది.
Recommended Video
సర్వే ఆధారంగానే పొత్తులు..
ప్రస్తుతం జనసేన కోసం పనిచేస్తున్న మాజీ పీకే టీమ్ తమ సర్వేలో పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటే అధికారం అందుకుంటారనే అంశంపైనా ప్రశ్నలు ఇచ్చారు. ప్రస్తుతం పవన్ పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండబోదని భావిస్తుండటం వల్లే పీకే టీమ్ జనం ముందు మరో ఆప్షన్ కోరినట్లు అర్ధమవుతోంది. భవిష్యత్తులో బీజేపీని వీడి మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని తేలితే అప్పటికప్పుడు ప్రణాళికలు మారిపోయినా ఆశ్చర్యం లేదు. అయితే ఇదంతా జనం నాడి ఆధారంగానే ఉండే అవకాశముంది. మొత్తం మీద వైసీపీ, టీడీపీ తర్వాత జనసేన కోసం కూడా పీకే టీమ్ సభ్యులు పనిచేస్తుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.