పీకే సర్వే 'చిచ్చు'?: ఆ పేర్లు ఎందుకొచ్చాయి?, ఏదైనా ఉంటే ముఖం మీదే చెప్పమని!..
తమ రిపోర్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలకు.. ఇది జస్ట్ అంచనా మాత్రమేనని పీకే టీమ్ వారికి వివరించినట్లు కథనంలో చెప్పుకొచ్చారు.
ఏలూరు: పాదయాత్ర సమయంలో గిడ్డి ఈశ్వరి లాంటి నేతలు వైసీపీని వీడటం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. దీని వెనకాల టీడీపీ మైండ్ గేమ్ కూడా ఉందనేది వైసీపీ శ్రేణుల వాదన.
Recommended Video
వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికార పీఠానికి దగ్గర చేయాలని జగన్ శతవిధాలా ప్రయత్నిస్తుంటే.. ప్రత్యర్థి వర్గం నుంచి కూడా అదే స్థాయిలో ఆయనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఆ ఛాన్స్ జగన్ ప్రియ శిష్యుడికేనా?: ఏలూరు వైసీపీలో ఏం జరుగుతోంది?..
ప్రత్యర్థికి ఉన్న మీడియా బలం జగన్కు లేకపోవడం ఎప్పటికీ మైనసే. అందువల్లే జగన్ పాదయాత్ర కన్నా ఆయనపై వచ్చే ప్రతికూల కథనాలకే మీడియాలో ఎక్కువ ఫోకస్ లభిస్తుందన్న వాదన ఉంది. ఇదే పరంపరలో వైసీపీకి సంబంధించిన ఓ ప్రతికూల కథనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఏంటా కథనం?:
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అత్యంత బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. 2014ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపించింది. వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితిని అధిగమించేందుకు పీకే బృందాన్ని రంగంలోకి దించింది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పీకే బృందం సర్వే నిర్వహించిందట. ఇటీవలి పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆ వివరాలను బయటపెట్టడం.. అందులో టీడీపీ నేతల పేర్లు దొర్లడం వివాదానికి దారితీసిందనే ప్రచారం మొదలైంది.
సర్వేలో ఆ పేర్లు ఎందుకొచ్చాయి?:
జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాల్లో పార్టీ పనితీరు, మెరుగుపడాల్సిన అంశాలపై పీకే టీమ్ పలు ఆసక్తికర వివరాలు అందించినట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు, ఒక నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకొస్తే వైసీపీ మైలేజ్ పెరుగుతుందని పీకే టీమ్ వాదించినట్లు.. దాన్ని వైసీపీ శ్రేణులు ఖండించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం పనిచేస్తున్నవాళ్లను కాదని, టీడీపీ నేతల పేర్లను సూచించడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించిందట.
ఏదైనా ఉంటే చెప్పేయండి:
సదరు నేతను పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందన్న కోణంలో పీకే టీమ్ సమావేశంలో వివరించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సదరు నేత కొన్నాళ్లు టీడీపీలో కొనసాగి.. ప్రస్తుతం ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. అయితే పీకే టీమ్ ఆయన పేరును ప్రస్తావించడం వైసీపీ నేతలకు అసలు మింగుడుపడటం లేదని ఆ కథనంలో చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల సమయానికి పక్కనపెట్టడం కంటే.. ఏదైనా ఉంటే ముందే ముఖం మీద చెప్పాలన్న తరహాలో వారు వ్యాఖ్యలు చేశారట.
అంచనా మాత్రమే:
తమ రిపోర్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలకు.. ఇది జస్ట్ అంచనా మాత్రమేనని అసంతృప్తి నేతలకు కొంతమంది వైసీపీ నేతలు నచ్చజెప్పినట్లు కథనంలో చెప్పుకొచ్చారు. మరో నియోజకవర్గం విషయంలోను ఓ కీలక టీడీపీ నేత సోదరుడి పేరును ప్రస్తావించడం కూడా కొంతమంది వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించిందట. అయితే మరికొందరు నేతలు మాత్రం పీకే టీమ్ ను సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. సర్వే విషయాలను వెల్లడించడం తప్పు కాదనేది వారి వాదనగా తెలుస్తోంది.
ఆ సీటు ఎవరికీ?:
ఏలూరు అసెంబ్లీ సీటుపై వైసీపీలో సందిగ్దం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆళ్ల నానినే బరిలోకి దింపుతారా?.. లేక ఆయనెలాగు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మరొకరికి టికెట్ ఇస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు. పరిస్థితులను బట్టి ఆళ్ల నానినే రంగంలోకి దింపవచ్చనేది కొంతమంది వాదన.
మరోవైపు నాని మాత్రం.. వచ్చే ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నవి కావడంతో అంత ఖర్చుకు తాను సిద్దంగా లేనని సన్నిహితులతో చెబుతున్నారట. దీనిపై వైసీపీ అధినేత జగన్ తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది వేచి చూడాల్సిందే.