Prashant Kishor జగన్కు దూరమవుతారా : టీడీపీ సైతం ప్రయత్నాలు : టార్గెట్ 2024 లో కీ రోల్..!!
ప్రకాశం కిషోర్. 2014 సాధారణ ఎన్నికల నుండి తాజాగా పశ్చిమ బెంగాల్..తమిళనాడులో మమత..స్టాలిన్ గెలుపు వెనుక వ్యూహకర్త. బీహార్ కు చెందిన ఈ రాజకీయ వ్యూహకర్త 2014 లో తొలి సారిగా ప్రధాని మోదీ ప్రచారంలో భిన్నంగా వ్యవహరించారు. విభిన్న మార్గాల ద్వారా మోదీకి మద్దతు సమకూర్చారు. మోదీ ప్రధాని అవ్వటంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఢిల్లీలో కేజ్రీవాల్.. పంజాబ్ లో అమరీందర్ సింగ్ గెలుపులో ఇదే రకమైన వ్యూహలతో వారి గెలపు వెనుక కీలకంగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ లో మాత్రం ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి.
2019లో జగన్ గెలుపు వెనుక..
ఇక, 2019 ఎన్నికల కోసం ఏపీలో జగన్ పాదయాత్ర మొదలు...అభ్యర్దుల ఎంపిక..మార్పు.. ప్రచారం..బైబై బాబు వంటి నినాదాలతో ఘన విజయం వెనుక నిలబడ్డారు. అయితే, జెడీయూ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ను పార్టీ బహిష్కరించింది. ఇక..పశ్చిమ బెంగాల్ బీజేపీకి వంద సీట్లు కూడా రావంటూ ట్వీట్ చేసి సంచలనానికి కారణమయ్యారు. ఫలితాలు అదే విధంగా వచ్చాయి. ఇక, తాను నిర్వహిస్తున్న ఐ ప్యాక్ నుండి వ్యూహకర్తగా పని చేయనని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఇక, ఇప్పుడు మమత గెలుపు కోరుకున్న నేతలను వరుసగా కలుస్తున్నారు. టార్గెట్ 2024 లో కీలకంగా మారారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నేతలను ఒకే వేదిక మీదకు తీసుకురావటం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.
పీకే కోసం టీడీపీ ప్రయత్నాలు..
అయితే, 2019 ఎన్నికల కోసం జగన్ కంటే ముందుగానే టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి వ్యూహకర్తగా పని చేయటం కోసం ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు చేసారు. అయితే, ఇంతలోనే వైసీపీ వేగంగా పావులు కదిపింది. ప్రశాంత్ కిషోర్ తమ కోసం వచ్చేలా చేయటంలో సక్సెస్ అయింది. అయితే, జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా..ఇంకా ప్రశాంత్ కిషోర్ మాజీ టీం గ్రౌండ్ లెవల్ లో తన పని తాను చేసుకుపోతోంది. ఎమ్మెల్యేల పనితీరు... ప్రజాభిప్రాయం.. పధకాల నిర్వహణ పైన పబ్లిక్ పల్స్ తెలుసుకుంటూనే ఉందని పార్టీ నేతలు చెబుతారు. ఇక, ఇప్పుడు 2023 తెలంగాణ ఎన్నికల కోసం టీఆర్ఎస్ కు ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవాలనేది మంత్రి కేటీఆర్ ఆలోచన.
గులాబీ పార్టీకి పీకే సేవలు..
కొద్ది నెలల క్రితం అమరావతి వచ్చి ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత హైదరాబాద్ వెళ్లి కేటీఆర్ ను కలిసారు. అయితే, తెలంగాణ మీద అణువు అణువు తెలిసి..రాజకీయంగా వ్యూహాల దిట్టగా పేరున్న కేసీఆర్ మాత్రం పీకే సేవలు అవసరం లేదని చెబుతున్నారని తెలుస్తోంది. ఇక, ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి బలోపేతం లక్ష్యంగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికల సమయంలో జగన్ ను తిరిగి పని చేసేందుకు రంగంలోకి దిగుతారా లేదా అనేదే ఇప్పుడు వైసీపీలో చర్చకు కారణమైంది. ప్రధాని మోదీ పైన వ్యతిరేకత చూపిస్తున్నందుకే ప్రశాంత్ కిషోర్ ను జేడీయూ నుండి తప్పించారని చెబుతారు.
ఏపీలో 2024లో ఎవరి వైపు..
మరి..మోదీకి వ్యతిరేకంగా ఉన్న ప్రశాంత్ కిషోర్ సేవలను జగన్ రానున్న రోజుల్లో కొనసాగించగలరా అనేది ఇప్పటి ప్రశ్న. కేంద్రానికి జగన్ అన్ని సందర్భాల్లోనూ మద్దతిస్తున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ పక్కా కార్పోరేట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన తన బిజినెస్..రాజకీయం కలిపి ముందుకు వెళ్లరని... ఆయన సేవలు కోరుకున్న వారికి అవి కంటిన్యూ అవుతాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక, ఏపీ ముఖ్యమంత్రి జగన సైతం తనకు రాజకీయంగా వ్యూహాలు.. సర్వేలు..సూచనలు చేసే ప్రశాంత్ కిషోర్ పైన గురి పెట్టుకున్నారు. ఆయన సేవలను కంటిన్యూ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. అయితే, టీడీపీ సైతం ఇప్పుడు జగన్ ను దెబ్బ తీసేందుకే ఎవరైతే ఆయన గెలుపులో కీలకంగా వ్యవహరించారో..ఆ పీకే నే తమకు వ్యూహకర్తగా మలచుకొనే ప్రయత్నాలు ఇప్పటి నుండే ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. కానీ, ప్రశాంత్ కిషోర్ మాత్రం అందుకు సిద్దంగా ఉన్నారా అంటే...సాధ్యపడదని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు.