మరో రెండేళ్ళు జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ ప్రస్థానం ...రీజన్ ఇదే
వైయస్ జగన్ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి కోసం పని చేస్తున్నారా? అంటే వైసీపీ వర్గాలు అవును అంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కడా పీకే పేరు వినిపించకపోవడంతో ఆయన మహారాష్ట్రలో పని చేస్తున్నారని, ఇక పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోసం పనిచేస్తున్నారని టాక్ వినిపించింది. ఇక దీంతో ఆయన జగన్ కోసం పనిచేయడం లేదనే ఒక భావన వ్యక్తమైంది. అయితే ప్రశాంత్ కిషోర్ జగన్ కోసం మరో రెండేళ్ల పాటు పని చేయనున్నారన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మీడియా పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం ... ఎందుకంటే
ఎన్నికల ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా జగన్ కోసం పని చేస్తున్న పీకే టీమ్
ఏపీలో ఎన్నికల వ్యూహకర్త, జగన్ పార్టీ గెలుపు కోసం గత మూడేళ్ళుగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ కి ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి . అయితే... జగన్ ఇచ్చిన ఆఫర్ ని ప్రశాంత్ కిశోర్ ఓకే చేశారా లేదా అన్నదే తెలియలేదు . కానీ జగన్ ఆఫర్ కు పీకే ఓకే అన్నారన్న వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది .ఇంతకీ జగన్ పీకే కు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా . ఎన్నికలకు ముందు పీకే ఆఫీస్ కు వెళ్ళిన సందర్భంలో ఈ ఎన్నికల్లో కనుక వైసీపీ గెలిస్తే... ఇప్పటి వరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారో ఇక పై కూడా జగన్ తో పాటు పీకే టీం పనిచేసేలా ఒప్పందం చేసుకుందామని జగన్ కోరినట్లు ప్రచారం జరిగింది . అంటే ఎప్పటికప్పుడు సర్వేలు చేయడం.. ఎలా చేస్తే ప్రజలను ఆకట్టుకోవచ్చు..ప్రజా వ్యతిరేకత ఎక్కడ ఉంది ? పాలనలో ఎలా ఉంటె ప్రజలకు మరింత చేరువ కావచ్చు వంటి అనేక అంశాలు పీకే టీం జగన్ కి అందిస్తారు . ప్రజా నాడిని ఎప్పటికప్పుడు జగన్ కు తెలియజేసి పాలన సజావుగా సాగేలా చూస్తారు పీకే టీమ్.
అధికారం మరో దశాబ్దం పాటు చేతుల్లో ఉండాలనే .. పీకే సహకారం తీసుకుంటున్న జగన్
ఇక జగన్ అనుకున్నట్టు ఏపీలో అధికారం చేపట్టింది వైసీపీ . ఇక ఈ నేపధ్యంలో జగన్ భవిష్యత్ రాజకీయాల్లోనూ అధికారం తమ చేతుల్లోనే ఉండేలా పీకే టీమ్ సహాయం తీసుకుంటుంది. తన ఆలోచన కార్యరూపం దాల్చడానికి జగన్ ప్రశాంత్ కిశోర్ సాయం పాలనలోనూ తీసుకుంటున్నారని సమాచారం . ఇక ప్రజలకు కావాల్సింది ఏంటి అనేది తెలుసుకోవటంలో ,ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో పీకే టీమ్ ఐ క్యాప్ ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజల అవసరాలను, వారి కోరికలను కనిపెట్టడానికి సర్వేలు కూడా చేసి అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలను రూపొందించి జగన్ కు అందించి వాటిని అమలు చేయించటంలో ప్రశాంత్ కిశోర్ జట్టు పనిచేస్తోంది.
పాలనాపరమైన సలహాలు సూచనలు చేస్తున్న పీకే టీమ్.. మరో రెండేళ్ళ పాటు సేవలు
ఇక అంతే కాదు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో)లో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అవినీతిని అరికట్టడానికి కూడా పీకే టీమ్ జగన్ కు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తుంది . ఈ వ్యవస్థ రూపకల్పన చేసి అది కార్యరూపం ధరించే విధంగా చూసే బాధ్యతను ప్రశాంత్ కిశోర్ టీమ్ స్వీకరించినట్లు తెలుస్తోంది. రెండేళ్ళ పాటు పీకే టీమ్ జగన్ కు సేవలు అందించనుంది. ప్రస్తుతం ఈ విషయంలో పీకే సంస్థ ఐ క్యాప్ సమర్ధవంతంగా తనపని తాను చేసుకుపోతుంది.