జగన్ నుండి కిషోర్ "ప్రశాంత" నిష్క్రమణ..!!
హైదరాబాద్: వైసీపి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ బరువు బాద్యతలు అర్థాంతరంగా దించేసుకున్నారు. గమ్యస్థానం రాకముందే వైఎస్ఆర్సీపి అనే రాజకీయ వాహనం నుండి జంప్ ఐపోయారు. దీంతో పార్టీలో చివరి వరకు ఉండి ప్రయాణికులకు జాగ్రత్తగా టిక్కెట్లు ఇష్యూ చేస్తాడనుకున్న పెద్ద మనిషి మద్యలోనే తన ఉద్యోగాన్ని ఒదిలేసుకున్నట్టైంది. ఈ సంఘటనతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన ముఖ్యనేతలు ఖంగుతిన్నంత పనైంది. పర్పస్ సర్వైవ్ కాక ముందే పనిమంతుడు పనికి పంగనామాలు పెట్టాడని పారిపోతే ఎంత ఆవేదనకు లోనౌతారో వైసీపి నేతలు కూడా అంతే ఆవేదరకు గురౌతున్నట్టు లోటస్ పాండ్ వర్గాలు తెలిజేస్తున్నాయి.
జర్నీ మద్యలో వైసీపి బస్సు దిగిపోయిన ప్రశాంత్ కిషోర్..! అయోమయంలో జగన్..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మరోసారి రిపీట్ కాకూడదనే పట్టుదలతో ఉన్న జగన్, అందుకోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు షెడ్యూలు ప్రకారం 2019లో జరిగినా, 2018 చివర్లో జరిగినా వైసీపీకి అత్యంత కీలకం కానుంది. మరో మాటలో చెప్పాలంటే వైసీపి పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికలు జీవన్మరణ సమస్య పరిణమించాయి.
గత కొంతకాలంగా పీకే మౌనం...! ఇప్పుడు అకస్మాత్తుగా జంప్...!!
రాబోవు ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారంలోకి వస్తేనే దానికి మనుగడ ఉంటుంది. అందుకే రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ కిశోర్ను తమ పార్టీ కోసం పని చేయడానికి నియమించుకున్నా జగన్. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన్ను ఎంపిక చేసుకున్నారు. పార్టీలోని సీనియర్ నేతల కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఆయనకు ఇచ్చారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ వైసీపీ వ్యవహారాలకు దూరంగా, మౌనంగా ఉండి, ఇప్పుడు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తడంతో జగన్ అయోమయానికి గురవుతున్నారని తెలుస్తోంది. కీలక సమయంలో హ్యాండ్ ఇవ్వడంతో లోటస్ పాండ్ వర్గాలు షాక్ గురైనట్టు సమాచారం.
పీకే సడెన్ షాక్..! అయోమయంలో వైసీపి ముఖ్యనేతలు..!!
బిహార్లోని బక్సర్కు చెందిన పీకే, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో చేరారు. బిహార్లోని నాసారం ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కిశోర్ గతంలో ఐక్యరాజ్యసమితిలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా పనిచేశారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా తన ప్రయాణం ప్రారంభించారు. 2012లో గుజరాత్ ఎన్నికల్లో, 2014 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ తరఫున పనిచేసిన ప్రశాంత్ కిశోర్, మోదీ విజయంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత అమిత్ షాతో భేదాభిప్రాయాల కారణంగా విడిపోయారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి(జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్) విజయం కోసం కృషిచేశారు.
జగన్ కి రాజకీయ సలహాలు ఇచ్చేదెవరు..! వైసీపిని గెలిపించేదెవరు..!!
2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్కు సలహాదారుగా ఉండి, కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ విఫలమయ్యారు. చివరిగా వైసీపీ వ్యూహకర్తగా పని చేసిన పీకే, ఎన్నికల సమయానికి ముందు ఆ పార్టీకి దూరం కావడం చర్చనీయాంశం అయింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం కావాలనుకుంటున్న జగన్కు పీకే తీసుకున్న నిర్ణయం మింగుడు పడడంలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి పీకే దూరం అవడం ఆ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా నడుస్తోంది.