అమిత్ షా ఇంట్లో ప్రశాంత్ కిశోర్: చంద్రబాబు ఔట్, జగన్ ఇన్?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఎ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలిగిన నేపథ్యంలో బిజెపి దూకుడు పెంచింది. ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలతో అధ్యక్షుడు అమిత్ షా అత్యవసరంగా శనివారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా, ఎపి పార్టీ వ్యవహారాల బాధ్యతలను రామ్ మాధవ్కు అప్పగించారు. ఇది సమయంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ అమిత్ షా నివాసంలో దర్శనమిచ్చినట్లు వార్తలు వచ్చాయి.
చాలా కాలంగా సాగుతోందే...
చంద్రబాబు తనంత తానుగా తెగదెంపులు చేసుకునేలా చేయాలని చేసిన బిజెపి ప్రయత్నం ఫలించింది. రాష్ట్రానికి అడిగినవి ఇవ్వకపోవడమే కాకుండా ఇంకేమీ ఇచ్చేది లేదంటూ అరుణ్ జైట్లీ ఒక్కటికి రెండు సార్లు చెబుతూ వచ్చారు. అయినా చంద్రబాబు ఓపికతో ఎదురు చూశారు. చివరకు జగన్ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించడంతో తాను కార్నర్ అవుతున్నట్లు గమనించిన చంద్రబాబు తొలుత కేంద్ర మంత్రులను ఉపసంహరించుకుని, ఆ తర్వాత ఎన్డీఎకు గుడ్బై చెప్పారు. కేంద్రంపై అవిశ్వాస ప్రతిపాదనకు కూడా సిద్ధపడ్డారు. దీంతో అమిత్ షా తన వ్యూహానికి పదును పెట్టారు.
అమిత్ షాతో సమావేశమైన స్థితిలో..
ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకులతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 14 మంది నేతలు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత ప్రశాంత్ కిశోర్ ఆ సమావేశంలోకి అడుగు పెట్టారు. దీంతో టిడిపి ఎన్డీఎ నుంచి వైదొలిగిన వెంటనే వైసిపి చేరేందుకు సిద్ధపడిందనే ఊహాగానాలకు బలం చేకూరిందని అంటున్నారు.
అమిత్ షా ఇలా చెప్పారని...
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్తో పొత్తు పెట్టుకుంటే కలిగే లాభనష్టాల గురించి ప్రశాంత్ కిశోర్ అమిత్ షాకు వివరించినట్లు ప్రచారం సాగుతోంది. ఎపి సమస్యలపై అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించిన ప్రశాంత్ కిశోర్ దాన్ని ఇప్పటికే జగన్కు అందించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ బిజెపి సమావేశానికి రావడం ఆసక్తిని కలిగిస్తోంది. బిజెపి, వైసిపిల మధ్య ఎన్నికలకు ముందే పొత్తు ఉంటుందా, తర్వాత ఇరు పార్టీలు ఏకమవుతాయా అనే విషయంపై చర్చ సాగుతోంది.
అమిత్ షా ఆరా తీశారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశం సెంటిమెంటుగా మారి, ఇతర పార్టీలు కూడా దాన్ని ఎత్తుకోవాల్సిన అనివార్య స్థితిలో పడిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్ షా బిజెపి రాష్ట్ర నేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పరిస్థితులు గురించి ఆయన నేతలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.