'మా బ్యాంకుల్లో డబ్బులు ఎవడేసుకోమన్నాడు?'
'మా బ్యాంకులో మిమ్మల్ని అసలు డబ్బులు ఎవడేసుకోమన్నాడు.. ఇప్పుడెందుకు ఇంతలా ఎగబడుతున్నారు?' ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు మేనేజర్ తీవ్ర అసహనంతో చేసిన వ్యాఖ్యలివి.
ప్రత్తిపాడు: నగదు కొరత.. ఖాతాదారుల నుంచి తీవ్రమైన ఒత్తిడితో పాటు పనిభారం పెరుగుతుండడంతో బ్యాంకు అధికారులు సహనం కోల్పోతున్నారు. తాజాగా ప్రత్తిపాడు ఆంధ్రా బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాదారులపై తీవ్రస్థాయి విరుచుకుపడడంతో.. ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మా బ్యాంకులో మిమ్మల్ని అసలు డబ్బులు ఎవడేసుకోమన్నాడు.. ఇప్పుడెందుకు ఇంతలా ఎగబడుతున్నారు? మిమ్మల్ని మేమేమైనా బ్రతిమాలామా.. మా బ్యాంకుకు రమ్మని పిలిచామా..?'అంటూ మేనేజర్ శ్రీనివాసరావు దురుసుగా మాట్లాడడంతో ఖాతాదారులు తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం ఖాతాదారులకు నగదు అందజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
గత శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు దినాలు కావడం.. సోమవారం నాడు నగదు కొరత కారణంగా విత్ డ్రాయల్స్ కు అనుమతి నిరాకరించడంతో.. మంగళవారం నాడు భారీ సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకులకు పోటెత్తారు. దీంతో బ్యాంకు ఎదుట తోపులాటలు, స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఉర్జీత్ దాకా.. ఆర్నెళ్ల ప్లాన్, మోడీకి పాలాభిషేకం చేసేవారు: నోట్ల రద్దుపై షాకింగ్ సీక్రెట్స్!
భారీ సంఖ్యలో ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరకున్నప్పటికీ.. బ్యాంకు సిబ్బంది తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఖాతాదారులు మండిపడ్డారు. చేతిలో డబ్బు లేక జనం అల్లాడుతుంటే.. పట్టించుకోరా? అంటూ మేనేజర్ను నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన మేనేజర్ ఖాతాదారులతో దురుసుగా మాట్లాడారని ఆరోపిస్తున్నారు. చివరికి ఖాతాదారులకు నగదు అందజేయడంతో వారు శాంతించినట్టుగా తెలుస్తోంది. కాగా, సరైనంత నగదు లేనప్పుడు తాము కూడా ఏం చేయలేం కదా! అని మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొనడం గమనార్హం.