పోలవరం పర్యటనలో అపశృతులు: పల్టీలు కొట్టిన మంత్రి కాన్వాయ్ కారు, దిగబడిన బస్సు
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతులు చోటు చేసుకున్నాయి. బుధవారం చంద్రబాబు తన కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే.
చారిత్రక ఘట్టం, ఎంతో ఆనందం: పోలవరం గ్యాలరీ వాక్లో చంద్రబాబు ఫ్యామిలీ
కాగా, ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్లోని కారు బోల్తాపడింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపునకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు టీడీపీ నేతలకు చిన్నపాటి గాయాలయ్యాయి.
ఇది ఇలా ఉంటే.. విజయవాడ నుంచి పోలవరం సందర్శనకు బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు ఏలూరు సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న మట్టిలో దిగబడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.
ఎంతసేపు ప్రయత్నించినా బస్సు ముందుకు కదలకపోవడంతో బస్సులోని 35మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేరే వాహనాల్లో పోలవరానికి తరలించారు.