జగన్! నాటకాలు కట్టిపెట్టు, టీడీపీని వీడి బీజేపీలోకా?: ప్రత్తిపాటి, జేడీ శీలం విసుర్లు
న్యూఢిల్లీ/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలంలు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇద్దరు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ.. జగన్పై ఆరోపణలు చేశారు.
ఇక రాజన్న రాజ్యం: జగన్, చిరుకే సాధ్యం కాలేదన్న రోజా, పాదాభివందనమంటూ..
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఉదయం పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. పండించిన పంటలను నేరుగా మార్కెట్కే తెచ్చకుని అమ్ముకుని లబ్ది పొందాలని సలహా ఇచ్చారు.
టీడీపీని వీడి బీజేపీలోకా?
తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి ఎవరూ వెళ్లరని మంత్రి ప్రత్తిపాటి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని నాలుగు సంవత్సరాలుగా మోసం చేస్తున్న బీజేపీలోకి ఏ నాయకులూ చేరరని మంత్రి అన్నారు.
కుట్రలు.. జగన్ అలా చెప్పగలడా?
బీజేపీతో ఎన్నికలకు ముందు తర్వాత పొత్తు ఉండదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చెప్పగలడా? అని సవాల్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని రాజీనామా డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా జగన్ పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజలు సమయం చూసి బుద్ధి చెబుతారని అన్నారు.
జగన్.. నాటకాలు కట్టిపెట్టు..
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామంటున్న వైసీపీ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధన పేరిట నాటకాలు ఆడుతున్న జగన్ వాటిని కట్టిపెట్టాలని అన్నారు.
చీకటి ఒప్పందం ఏంటో చెప్పాలి?
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామంటూ వైసీపీ అధినేత జగన్ డ్రామాలాడుతున్నారని, బీజేపీతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాన్నిజగన్ బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని చెబుతున్న జగన్.. ఏ మార్గంలో ప్రత్యేక హోదా సాధిస్తారనే విషయాన్ని బహిరంగంగా చెప్పాలని జేడీ శీలం డిమాండ్ చేశారు.