కాల్మనీ ఆగడాలపై ఉక్కుపాదం, జగన్ పార్టీ నేతలే ఎక్కువ: పత్తిపాటి
గుంటూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్మనీ ఆగడాలపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. కాల్మనీ వ్యవహారంలో ఎక్కువమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచీ కాల్మనీ నడుస్తోందని, అలాంటివారిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఆదివారం చిలకలూరిపేటలో ఏపీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్, ఏపీ స్టేట్ సీడ్ డెవలంప్మెంట్ లిమిటెడ్ డైరీలను పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడబోదన్నారు.
అయితే, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం సహించేది లేదని మంత్రి అన్నారు. సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు సహాకరిస్తుందన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేస్తామన్నారు.
చేతివృత్తుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
చేతివృత్తుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హోల్లో ఏర్పాటుచేసిన జాతీయస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రులు ఆదివారం ప్రారంభించారు.
ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను అమ్మకానికి అందుబాటులో ఉంచారు. చేనేత వస్త్రాలకు పాచుర్యం కల్పించడం, మార్కెట్ సదుపాయాలు ఏర్పాటు చేసే లక్ష్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భీమిలిలో రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి శిద్దా
ఆంధ్రప్రదేశ్ రవాణశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆదివారం విశాఖపట్నం జిల్లా భీమిలిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. రూ.65కోట్లతో చేపట్టిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.