కొండ్రు చేరిక ఎఫెక్ట్: ముఖ్యమంత్రితో ప్రతిభాభారతి భేటీ, హామీ ఇచ్చిన చంద్రబాబు
అమరావతి: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు, శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం ఇంఛార్జ్, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి సీఎం చంద్రబాబును కలవడం చర్చనీయాంవంగా మారింది. బుధవారం ఆయన నివాసంలో చంద్రబాబును కలిశారు ప్రతిభాభారతి.
31న టీడీపీలోకి కొండ్రు, ప్రతిభాభారతిపై అసంతృప్తి! మారనున్న రాజకీయ ముఖచిత్రం
రాజాం పరిస్థితిపై బాబుకు వివరణ
ఈ సందర్భంగా జిల్లాతోపాటు రాజాం నియోజకవర్గంలోని పరిస్థితులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో గ్రూపులు కట్టేలా కొందరు ప్రోత్సహిస్తున్నారని సీఎంకు ప్రతిభాభారతి ఫిర్యాదు చేశారు. అంతేగాక, మాజీ మంత్రి కొండ్రు మురళీ పార్టీలో చేరిక అంశంపై చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.
ప్రతిభాభారతికి ప్రాధాన్యత తగ్గదంటూ బాబు హామీ..
అయితే, పార్టీ బలోపేతం కోసం చేరికలు కొనసాగుతాయని చంద్రబాబు ఆమెకు చెప్పినట్లు తెలిసింది. కానీ, పార్టీలో ప్రతిభాభారతికి అత్యంత ప్రాధాన్యత ఉందని, పార్టీలోకి ఎవరొచ్చినా అది ఏమాత్రం తగ్గదని చంద్రబాబు ఆమెకు భరోసా ఇచ్చారు. దీంతో ప్రతిభారతి సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ వైపు..
కాగా, కాంగ్రెస్ పార్టీ నేతలు కొండ్రు మురళి, ఉగ్రనరసింహా రెడ్డి వంటి కొందరు నేతలు ఇప్పటికే అధికార పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. కానీ నందమూరి హరికృష్ణ మృతితో పలువురి చేరిక ఆలస్యం అయింది.
కొండ్రు చేరిక.. బాబుతో భేటీ..
కొండ్రు మురళి గురువారం టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి కూడా సైకిల్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి. వీరి చేరిక ద్వారా పలువురు స్థానిక టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొండ్రు చేరికపై అసంతృప్తితో ఉన్న ప్రతిభా భారతి ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.