100కోట్ల హిందువులకు మంచి జరగాలి: శ్రీవారికి తొగాడియా ప్రార్థన
చిత్తూరు: దేశంలో హిందువుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని, గణాంకాల్లో తేలిందని, ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే హిందువుల మనుగడ కష్టమని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు.
ఆయన మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వంద కోట్ల మంది హిందువులకు మంచి జరగాలని తాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించానని చెప్పారు.
దేశంలో అందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తుల పైన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనవసర భారం మోపుతోందన్నారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని మతాలు ఒక్కటి కావాలన్నారు.
కాగా, ఇటీవల కేంద్రం నివేదికలో హిందువుల పెరుగుదల శాతం తగ్గినట్లుగా తేలిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా హిందువులు... భారత దేశంలో 80 శాతం కంటే తగ్గారు. గతంలో ఎప్పుడు ఎనభై శాతం కంటే తగ్గలేదు.