ఎలా ఇస్తారు?: కేసీఆర్పై ప్రవీణ్ తొగాడియా ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం పైన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా గురువారం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉదయం హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం హిందూ సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. మతపరమైన రిజర్వేషన్లు చట్ట వ్యతిరేకమన్నారు. అలాంటప్పుడు ఆయన ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు.
హైదరాబాదులో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరిగే హిందూ సమ్మెళనం వివరాలు వెల్లడించారు. అనంతరం ఆయన భాగ్యనగరం విశ్వహిందూ పరిషత్ వెబ్ సైట్ ప్రారంభించారు. ఆయన తెలుగు రాష్ట్రాల పర్యటన నిమిత్తం వచ్చారు.
యాదగిరిగుట్టపై 180 అడుగుల అంజన్న
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి విగ్రహం ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన మేరకు ఆ దిశగా దేవస్థానం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విగ్రహం ఏర్పాటుకు అనువైన ప్రదేశం, విగ్రహం ఎత్తుపై అంచనాలు వేస్తున్నారు.
మన దేశంలో ఎత్తయిన ఆంజనేయుడి విగ్రహాలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్లో ఎత్తయిన విగ్రహం విజయవాడ సమీపంలోని కంచికచర్ల మండలం పరిటాలలో ఉంది. విగ్రహం ఎత్తు 135 అడుగులు కాగా, పీఠంతో కలిపి 150 అడుగులు ఉంది. మూడెకరాల పరిధిలో గల శ్రీరామపాదక్షేత్రంలో 30 ఏప్రిల్ 2001న విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
సిమెంట్, ఇసుక, కంకరను దీని నిర్మాణానికి వినియోగించారు. 2003 జూన్ 22న విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. హర్యానాలోని కురుక్షేత్రం వద్ద దీనికంటే ఎత్తుగా.. 150 అడుగుల ఆంజనేయ విగ్రహం ఉంది.
అంతకన్నా ఎత్తయిన విగ్రహాన్ని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం మండపం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. దీని ఎత్తు 176 అడుగులు. 2015లో పూర్తి చేయాలనే లక్ష్యంతో 2005లో పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఇంతకన్నా ఎత్తయిన విగ్రహాన్ని యాదగిరిగుట్టపై నెలకొల్పాల్సి ఉంటుంది. సుమారు 180 అడుగులు ఉండవచ్చునని చెబుతున్నారు.