హిందువులకు తొగాడియా హెచ్చరిక, చంద్రబాబుపై ఆగ్రహం
ఎస్పీఎస్ నెల్లూరు: భారత దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటిస్తేనే రక్షణ అని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా గురువారం అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
భారతదేశంలో నానాటికీ హిందువుల సంఖ్య తగ్గిపోతోందని, హిందువుల సంఖ్య పెరిగేందుకు, హిందూ సామ్రాజ్యం ఏర్పడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మత మార్పిడిలను సాహసోపేతంగా ఎదుర్కోవాలన్నారు. హిందూ ధర్మరక్షణకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
హిందు ధర్మాన్ని పాటించాలన్నారు. విశ్వహిందూ పరిషత్ ఏర్పటైన 50 సంవత్సరాల నుండి హిందూ పరిరక్షణకు వీహెచ్పీ ఎంతో పాటుపడుతోందన్నారు. రెండు లక్షలకు పైగా కార్యక్రమాలు చేయడమే కాకుండా విదేశాల్లో సైతం హిందు ధర్మాన్ని విస్తరింప చేసేందుకు కృషి చేస్తోందన్నారు.
ఒకప్పుడు భారతదేశం అంతా హిందువులే ఉండేవారని, మరే మతం లేదన్నారు. కానీ రానురాను మతమార్పిడిలతో హిందువుల సంఖ్య దేశవ్యాప్తంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఎక్కడ చూసినా మత మార్పిడిలపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయని, మతమార్పిడిలపై గుండెలు బాదుకునే రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇదేవిధంగా మత మార్పిడిలు జరిగితే హిందువులు దేశంలో కనుమరుగైపోతారన్నారు. గత పదేళ్లలో యాభై లక్షల మతమార్పిళ్లను అడ్డుకున్నామని చెప్పారు. హిందూ దేశంలో అందరికీ ఒకే చట్టం అమల్లోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు హిందువుల అభ్యున్నతిని అడ్డుకునే ఔరంగజేబులను తరమి కొడతామన్నారు. బంగ్లాదేశ్కు చెందిన ముస్లీంలను భారత దేశంలో ఉంచేందుకు అంగీకరించే ప్రశ్నే లేదన్నారు.
బాబుపై ఆగ్రహం
అంతకుముందు ఉదయం ప్రవీణ్ తొగాడియా ఏపీ సీఎం చంద్రబాబు పైన మండిపడ్డారు. విదేశీ పర్యటనల పైన ఉన్న శ్రద్ద చంద్రబాబుకు శ్రీకాళహస్తి రాజగోపురం పునర్నిర్మించడంలో లేదని విమర్శించారు. శ్రీకాళహస్తి రాజగోపురం కుప్పకులి ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.