ఉద్యోగ సంఘాల నేతలకు మరోసారి చర్చలకు ఆహ్వానం: స్టీరింగ్ కమిటీ మల్లగుల్లాలు
అమరావతి: రాష్ట్రంలో పీఆర్సీ రగడకు అడ్డుకట్ట పడట్లేదు. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సామరస్యపూరకంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఏపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు.. కొలిక్కి రావట్లేదు. కొత్త జీవోలను రద్దు చేసేంత వరకూ ప్రభుత్వంతో చర్చలు కూడా ఉండబోవంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ప్రకటించడంతో ఇది మరింత ముదిరినట్టే. చెప్పినట్టుగానే తొలివిడత చర్చలను వారు బహిష్కరించారు. ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ.. తిరస్కరించారు.
ఇప్పుడైనా హాజరవుతారా?
ఇప్పుడు మళ్లీ ఉద్యోగ సంఘాల నాయకులతో మరో విడత చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. జేఏసీ నేతలకు సమాచారాన్ని పంపించింది. చర్చలకు రావాల్సిందిగా వారికి ఆహ్వానాన్ని పంపింది. దీనికి వారు అంగీకరించితే- ఈ మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ఏ సమావేశం ఏర్పాటవుతుంది. దీనికి వెళ్లాలా? వద్దా అనే విషయంపై జేఏసీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. చర్చలకు వెళ్లడమంటూ జరిగితే- తాము మెట్టు దిగినట్టవుతుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు.
ప్రత్యేక కమిటీ వేసినా..
పీఆర్సీ అమలుపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు, సంప్రదింపులను జరపడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సమాచార శాఖ మంత్రి పేర్నినానిలతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మలను ఈ కమిటీలో నియమించింది.
12 గంటలకు మళ్లీ భేటీ..
ఈ కమిటీ తాజాగా ఉద్యో సంఘాల నాయకులను చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం పంపించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ వారికి ఫోన్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, హాజరు కావాలంటూ ఆయన ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. తాజాగా అందిన ఈ ఆహ్వానం పట్ల ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ మల్లగుల్లాలు పడుతోంది.
ఆహ్వానంపై మల్లగుల్లాలు..
వెళ్లడం.. వెళ్లకపోవడం వల్ల సంభవించే పరిణామాల గురించి అంచనా వేస్తోంది. ఈ సమావేశానికి వెళ్తే.. మెట్టు దిగినట్టవుతుందనే అభిప్రాయాలు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల్లో వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు. దీనిపై చర్చించడానికి స్టీరింగ్ కమిటీ నాయకులు ఈ ఉదయం 10 గంటలకు సమావేశం అయ్యారని, ఇందులో మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
సమ్మెను నివారించడానికి..
పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనేది వారి ప్రధాన డిమాండ్. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సమ్మె నోటీసును కూడా ఇచ్చారు. ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. దీని ప్రకారం- పీఆర్సీ వివాదం పరిష్కారానికి నోచుకోకపోతే ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తారు.
దీన్ని నివారించడానికి జగన్ సర్కార్.. తనవంతుప్రయత్నాలు చేస్తో్ంది. ఇందులో భాగంగానే- మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన అత్యున్నత స్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. తొలి విడత చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలు రాకపోవడంతో.. ఇప్పుడు తాజా ఆహ్వానానికి వారు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి రేపుతోంది.