ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా పెరిగిన జీతాలు..!!
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దసర పండగ కానుకను ప్రకటించింది. వేలాదిమంది ఉద్యోగుల కలను సాకారం చేసింది. ఇవ్వాళ్టి నుంచి ఆర్టీసీ కార్మికులు..అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పీఆర్సీ అమలు కానుంది. పీఆర్సీ కలిపిన కొత్త జీతాలను వారు అందుకోబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ప్రమోషన్ తీసుకున్న 2,094 మందికి మినహా మిగిలిన వారందరికీ అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అందుతాయి. పదోన్నతి పొందిన వారికి నవంబర్ 1వ తేదీ నుంచి పీఆర్సీతో కూడిన వేతనాలు చెల్లిస్తుంది ప్రభుత్వం. దీనివల్ల ఒక్కో ఉద్యోగి జీతంలో కనీసం 3,000 నుంచి 6,000 రూపాయలు పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏపీఎస్ఆర్టీసీలో పని చేస్తోన్న సుమారు 52 వేల మందికి పైగా ఉద్యోగులకు లబ్ది కలుగుతుంది.
తాము అధికారంలోకి వస్తే- ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఉద్యోగులకు పే రివిజన్ను వర్తింపజేస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో తన పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఆ మరుసటి సంవత్సరమే దాన్ని అమలు చేశారు. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనమైంది ఆర్టీసీ. ఆ సమయంలో పీఆర్సీ అమలు కావడంలో జాప్యం చోటు చేసుకుంది.
డీజిల్ రేటు భారీగా పెరిగిపోవడం, బస్సుల నిర్వహణ వంటి కారణాలతో పీఆర్సీని అమలు చేయడం ఆలస్యమైంది. ఈ అదనపు ఆర్థిక భారం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు సకాలంలో పీఆర్సీని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కూడా ఆ పరిస్థితులే ఉన్నప్పటికీ- ఉద్యోగుల డిమాండ్, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పీఆర్సీని అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తాము కూడా జీతాలు అందుకోబోతోండటం పట్ల కార్మికుల్లో సంతోషం వ్యక్తమౌతోంది.