మరో గంటలో ఇల్లు చేరుతామనగా.. ఘోర ప్రమాదం... రోడ్డుపై బోరున విలపించిన టెక్కీ...
కర్నూలు జిల్లా అంకిరెడ్డిపల్లె సమీపంలోని ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు,లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక గర్భిణీ స్త్రీ మృతి చెందగా... ఆమె భర్త గాయాలపాలయ్యాడు. ప్రమాద ఘటన అనంతరం తన భార్యను కాపాడాలని అతను రోధించడం అక్కడున్నవారిని కలచివేసింది.
వివరాల్లోకి వెళ్తే... కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం ఎర్రగుంట్లకు చెందిన శేగిరెడ్డి నరేష్కుమార్ రెడ్డి బెంగళూరులో సాప్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇటీవల కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో అక్కడి ప్రభుత్వం మరోసారి వారం పాటు లాక్ డౌన్ విధించనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళ్లాలనుకున్న నరేష్ కుమార్ రెడ్డి బైక్పై భార్య సుజాత(29),ఏడాది వయసున్న కుమారుడిని ఎక్కించుకుని బయలుదేరాడు. అప్పటికే నరేష్ సోదరుడు సతీష్ రెడ్డి కూడా అన్నావదిలను తన కారులో తీసుకొచ్చేందుకు బయలుదేరాడు. మార్గమధ్యలో అన్న బైక్పై ఎదురుపడటంతో... బైక్ సతీష్ తీసుకుని,కారును అన్న నరేష్కు ఇచ్చాడు. దీంతో భార్యా,పిల్లలతో నరేష్ కారులో ఇంటికి బయలుదేరాడు.
Recommended Video
మరో గంటలో ఇంటికి చేరుకుంటామనగా.. అంకిరెడ్డిపల్లె సమీపంలో ఆ కారు ప్రమాదానికి గురైంది. కంకర లోడ్తో వస్తున్న ఓ లారీ,నరేష్ డ్రైవ్ చేస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సుజాతను 108లో తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. నరేష్ గాయాలపాలయ్యాడు. తన భార్యను బతికించాలని నరేష్ రెడ్డి బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.