గర్భిణి దారుణ హత్య, భార్యను నరికి చంపిన భర్త
హైదరాబాద్: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని లక్కవరపుకోటలో గల గోల్డ్స్పాట్ కంపెనీ కూడలి వద్ద నిండు గర్భిణిని అతి దారుణంగా హత్య చేశారు. భర్తే నిప్పంటించి ఆమెను చంపి ఉంటాడని స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలిని ఉత్తరప్రదేశ్కు చెందిన వాసిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
భార్యను నరికి చంపిన భర్త
అనంతపురంలో దారుణం జరిగింది. జిల్లాలోని గుదిబండలో కట్టుకున్న భార్యను భర్త కత్తతో దారుణంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అకాల వర్షాల కారణంగా ఏపీలో తొమ్మిది మంది మృతి
ఏపీలో కురిసిన అకాల వర్షాల కారణంగా తొమ్మిది మంది మృతి చెందినట్లు హోం శాఖ మంత్రి చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల కారణంగా సుమారు పదివేల ఐదు వందల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు.