తెలంగాణలో 'ఆంధ్ర' రాజకీయ 'కుట్ర': పవన్తో తమ్మినేని చర్చలపై అనుమానాలు!
గురువారం నాడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం.. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏవిధంగా రూపుదిద్దుకోబోతుందో అన్న విషయాన్ని పట్టిస్తోంది.
హైదరాబాద్: ఒకప్పుడు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన శక్తులు.. ఇప్పుడిక్కడి సమాజాన్ని ఉద్దరిస్తామంటూ బయలుదేరడానికి సన్నద్దమవుతున్నాయి. తెలంగాణ అంశం అత్యంత ప్రజాస్వామిక డిమాండ్ అన్న సోయిని మరిచిపోయినవాళ్లంతా.. ప్రజాస్వామ్యం ముసుగులో ఫక్తు రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
అలా చెప్పిన తెల్లారే.. పవన్ కళ్యాణ్తో భేటీ: థర్డ్ ఫ్రంట్ కోసమూ
నిజానికి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమున్నా.. ఇప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సి రావడం రాజకీయ పార్టీలు ప్రజలకు కల్పించిన దుస్థితి అనే చెప్పాలి. ఇప్పటి పరిస్థితిని గమనిస్తే.. తెలంగాణ ముఖం చిత్రం మీద 'టీఆర్ఎస్' అనే బలమైన శక్తిని ఎదుర్కోవడానికి ఒక ప్రత్యామ్నాయ వేదిక తయారుకాబోతుందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ వేదిక ఎవరి నాయకత్వంలో.. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నది 'కుట్ర' అన్న పదంలోని అసలు ఉద్దేశం.
ఎవరు ఏకమవుతున్నారు?:
గురువారం నాడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం.. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏవిధంగా రూపుదిద్దుకోబోతుందో అన్న విషయాన్ని పట్టిస్తోంది. గతంలో వీరివురు తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేనివారే.
ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేక గొంతుకలుగా ముద్రపడ్డ వీరు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. అయితే అది అయ్యే పనేనా?, టీఆర్ఎస్ చేస్తున్న తప్పిదాలు సైతం తెలంగాణలో వీరి స్థిరత్వ ప్రయత్నాలకు పరోక్షంగా సహకరిస్తున్నాయా?
జనం నమ్ముతారా?:
ధర్నా చౌక్ వల్లే తెలంగాణ వచ్చిందని, అలాంటి ధర్నా చౌక్ ను ఎత్తివేయకూడదని పవన్ కళ్యాణ్ కేసీఆర్ సర్కార్ కు హితవు పలికారు. కానీ ఈ ధర్నా చౌక్ తెలంగాణ కోసం ఎంత దద్దరిల్లినా.. పవన్ కళ్యాణ్కు అప్పట్లో దీని గురించి ఆలోచించే సమయం కూడా లేకుండా పోయిందన్నది గమనించాల్సిన అంశం.
ఇక టీఆర్ఎస్ తప్పిదాలు కూడా వ్యతిరేక శక్తులకు తెలంగాణలో గొంతెత్తే అవకాశాన్ని కల్పిస్తున్నాయన్నది కూడా కాదనలేని అంశం. రైతులకు బేడీలు వేయడం, ధర్నా చౌక్ను మరో చోటుకు తరలించడం.. వంటి చర్యలు లేని శక్తులకు ఊతమివ్వడమే తప్పించి మరొకటి కాదు.
కేసీఆర్ పని మరింత సులువు:
నిజానికి సీపీఎం,పవన్ కళ్యాణ్ ఒక్క వేదిక మీదకు రావడం.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పనిని మరింత సులువు చేసే అవకాశం లేకపోలేదు. తెలంగాణ వ్యతిరేకులు.. తెలంగాణ కోసం పోరాడినవారు.. అన్న చీలికను తెలివిగా టీఆర్ఎస్ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది.
ఒకప్పుడు ఈ రెండు శక్తులు తెలంగాణ పట్ల ప్రదర్శించిన తీరును టీఆర్ఎస్ కచ్చితంగా జనం చర్చించుకునేలా చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిందన్న విషయం తెలిసి 10రోజులు అన్నమే ముట్టుకోలేదన్న పవన్ వ్యాఖ్యలు తెలంగాణ జనం ఎప్పటికీ మరిచిపోలేరు. కాబట్టి సీపీఎం, పవన్ కళ్యాణ్ వల్ల అధికార పార్టీకి పెద్దగా డ్యామేజీ జరిగే అవకాశం ఎంతమాత్రం లేదనే చెప్పాలి.
ఆధిపత్య వర్గాల కుట్ర:
తెలంగాణ ఉద్యమమంతా ఆంధ్రా ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా జరిగిందే. మరీ ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం దోపిడీని అడ్డుకోవడానికి తెలంగాణలోని శక్తులన్ని ఏకమయ్యాయి. ఇప్పుడు సీపీఎంకు నాయకత్వం వహిస్తున్న తమ్మినేని వీరభద్రం కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే.
సోషలిస్టు సమాజాన్ని కాంక్షించే కమ్యూనిస్టు పార్టీలు నాయకత్వాన్ని మాత్రం అగ్రకులాల చేతుల్లోనే ఎందుకు పెట్టుకుంటాయన్నది చాలాకాలంగా వారిని వెంటాడుతున్న ప్రశ్న. బలమైన సామాజిక వర్గానికి గనుక నాయకత్వం అప్పగించాలనుకుంటే.. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సింది.
కానీ ఆంధ్రాలో లాగే ఇక్కడ కూడా కమ్మ నాయకత్వాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. ఒకవిధంగా తిరిగి కమ్మ ప్రాబల్యాన్ని పెంచేందుకు, ఆంధ్ర ఆధిపత్య శక్తులకు ఊతమిచ్చేందుకు ఇదంతా పరోక్షంగా జరుగుతోన్న కుట్ర అన్న వాదనలు తెరమీదకు వస్తున్నాయి. అయితే కమ్మ సామాజిక వర్గంపై తెలంగాణ జనంలో ఉన్న నెగిటివ్ అభిప్రాయం కూడా.. సీపీఎంకు ప్రతికూలాంశమే.
'కమ్మ' సామాజిక వర్గం కన్ను:
తెలంగాణలో కమ్మ నాయకత్వం గనుక బలపడితే.. ఆ సామాజిక వర్గానికి దారులు పరిచినట్లేనన్న భావన కూడా ఉంది. అదే జరిగితే ఒకప్పటి దోపిడీ కుట్రలు మళ్లీ పునరావుతమవుతాయి. కాబట్టి జనంలో సీపీఎం ప్రయత్నాలు ఎంతమేర విశ్వసనీయతను చూరగొంటాయనేది అనుమానమే.