రాష్ట్రపతి ఎన్నిక: ఏకగ్రీవం చేద్దాం.. మమతతో మాట్లాడండి.. బాబును కోరిన షా!?
రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించే విషయమై పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రాయబారం నడపాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా
అమరావతి: రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించే విషయమై పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు. ఎన్డీఏ తరఫున ఈ బాధ్యతను స్వీకరించాల్సిందిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్షా... చంద్రబాబు నాయుడిని కోరారు. దీనికి చంద్రబాబు కూడా సరేనన్నారు.
శుక్ర, శనివారాల్లో మమతా బెనర్జీతో మాట్లాడతానని చంద్రబాబు అమిత్ షాకు చెప్పినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ముఖ్యులైన ప్రతిపక్ష నేతలతో ఎన్డీఏ తరఫున మాట్లాడుతున్నామని... అందులో భాగంగానే ఈ బాధ్యత తీసుకోవాలని అమిత్షా చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఇంటికి భోజనానికొచ్చి...
బీజేపీ పోలింగ్ కేంద్రం స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొనేందుకు గురువారం విజయవాడకి వచ్చిన అమిత్షాని మధ్యాహ్న భోజనానికి చంద్రబాబు తన ఇంటికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిరువురు దాదాపు 25 నిమిషాలపాటు ముఖాముఖి మాట్లాడుకున్నారు.
కోరికల చిట్టా విప్పిన బాబు...
తెదేపా వర్గాల సమాచారం మేరకు... ఇరువురి నడుమ జరిగిన భేటీలో వివిధ అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ఏపీకి ప్రత్యేక హోదా బదులుగా ఇచ్చిన ప్యాకేజీని త్వరితగతిన పూర్తి స్థాయిలో అమలుచేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు అమిత్ షాను కోరినట్లు సమాచారం.
‘తెలంగాణతో కాస్త ఇబ్బంది..’
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పెంపును కూడా త్వరగా చేపట్టాలని చంద్రబాబు ఆయన్ని కోరగా, దీనిపై అమిత్ షా కాస్త ఆచితూచి మాట్లాడినట్లు తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాల పెంపు విషయంలో తెలంగాణతో కాస్త ఇబ్బంది ఉందని అమిత్ షా అన్నట్లు సమాచారం.
బీజేపీ సర్వే.. అంతా ఓకే...
రైల్వేజోన్ని కూడా త్వరగా ప్రకటించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాను అడిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, రెండు పార్టీల మధ్య పొత్తు యథావిధిగా కొనసాగటం తదితర అంశాలు కూడా వీరిరువురి భేటీలో ప్రస్తావనకొచ్చాయి. ఇటీవల సర్వే చేయించగా... రాష్ట్రంలో అంతా బాగుందని తేలినట్లు అమిత్షా పేర్కొన్నట్లు సమాచారం.