వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి రాష్ట్రపతి ఊరట- ఆ రెండు పదవులకూ ఒకే...
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా బీజేపీ నేత రామకోటయ్య ఏకంగా రాష్ట్రపతి కోవింద్ జోక్యం కోరుతూ లేఖ కూడా రాశారు. పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం నిబంధనల ప్రకారం సాయిరెడ్డిపై వేటు వేయాలని కోరారు. దీంతో ఆయన ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనకు పంపారు. సుదీర్గ పరిశీలన తర్వాత ఈసీ రాష్ట్రపతికి ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది.
విజయసాయిరెడ్డి ఎంపీగా ఉంటూ ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని ఎన్నికల సంఘం రాష్ట్రపతికి స్పష్టత ఇచ్చింది. ఎంపీగా జీతభత్యాలు తీసుకుంటున్న సాయిరెడ్డి.. ఢిల్లీలో ప్రతినిధిగా మాత్రం జీతభత్యాలు తీసుకోవడం లేదని, అప్పుడు పరస్పర విరుద్ధ ప్రయోజనాల సమస్య తలెత్తబోదని ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం వర్తించబోదని తెలిపింది. దీంతో సాయిరెడ్డికి అనర్హత చెల్లదంటూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
Recommended Video
వాస్తవానికి ఎంపీగా ఉంటూ ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన విజయసాయిరెడ్డి పరస్పర విరుద్ధ ప్రయోజనాల వ్యవహారం తెరపైకి రావడంతో ఆ పదవిని వదులుకున్నారు. తాజాగా ఆ పదవిలో ఏపీ ప్రభుత్వ ముఖ్యసలహాదారుగా ఉన్న అజయ్ కల్లంను కూడా ప్రభుత్వం నియమించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుటుందో చూడాలి.