ఉత్తరాంధ్ర సత్తా: శ్రీకాకుళం గిరిజన మహిళకు ప్రతిష్ఠాత్మక పురస్కారం: రాష్ట్రపతి చేతుల మీదుగా.. !
శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ తన సత్తా చాటారు. దేశ రాజధాని వేదికగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. తన తోటి గిరిజన మహిళలకు పోడు వ్యవసాయంలో మెళకువలను నేర్పించడం, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం, వితంతువులకు వ్యవసాయంపై సమగ్ర అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆమె ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు.
జగన్ సర్కార్పై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్: తొమ్మిది నెలల్లో 180 అత్యాచారాలంటూ..!
ఆ గిరిజన మహిళ పేరు పడాల భూదేవి. శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన మహిళ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె నారీశక్తి అవార్డును అందుకున్నారు. మన రాష్ట్రం నుంచి పడాల భూదేవి ఒక్కరే ఈ అవార్డు కోసం ఎంపిక అయ్యారు. గిరిజన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఆమె ప్రత్యేకంగా చిన్నై ఆదివాసీ వికాస్ సొసైటీని నెలకొల్పారు.
దీనికింద ఆమె పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం పడాల భూదేవి.. మన్యం గ్రెయిన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మన్యదీపిక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్థలకు డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయానికి నోచుకోని గిరిజన మహిళలు, వారి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడానికి నిరంతరాయంగా కృషి చేశారు. సమీకృత గిరిజనాభివృద్ధి ఏజెన్సీ (ఐటీడీఏ) సహకారంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలు, శిశువుల సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
11 సంవత్సరాల వయసులోనే పడాల భూదేవికి వివాహమైంది. భర్త, అత్తమామల నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. తన కష్టాలను ఎదుర్కొన్నారు. ముగ్గురు ఆడపిల్లలకు ఉన్నత చదువులు చదివించారు. సొంతంగా ప్రైవేటు సంస్థలను నెలకొల్పి, గిరిజన మహిళల అభ్యున్నతి కోసం పని చేస్తున్నారు. వారికి ఆదర్శవంతంగా నిలిచారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. నారీశక్తి పురస్కారానికి ఎంపిక చేసింది. పడాల భూదేవితో పాటు పలువురు మహిళలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.