జగన్ సర్కారుకు మరో షాక్- దళితుడి శిరోముండనం కేసులో రాష్ట్రపతి కార్యాలయం విచారణ
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు వరప్రసాద్కు శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. తనకు శిరోముండనం చేయించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, తన గౌరవానికి భంగం కలుగుతున్నందున నక్సలైట్ గా మారేందుకు అనుమతివ్వాలని వరప్రసాద్కు తాజాగా రాష్ట్రపతికి మెయిల్ పంపాడు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ప్రత్యేక విచారణకు ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వంలోని సాధారణ పరిపాలన శాఖకు చెందిన అదనపు సెక్రటరీ ర్యాంకు అధికారి జనార్ధన్ బాబును విచారణ అధికారిగా నియమించింది. జనార్ధన్ బాబు వద్ద విచారణకు హాజరై తమకు పంపిన కాల్ రికార్డులు, వీడియోలు, ఇతర సాక్ష్యాలను అందజేయాలని రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. జనార్ధన్ బాబుకు ఈ విషయంలో సహకారం అందించాలని బాధితుడు వరప్రసాద్కు సూచించింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
శిరోముండనం ఘటన తర్వాత ప్రభుత్వం ఇందుకు కారకులైన పోలీసులను సస్పెండ్ చేసింది. అయితే ఘటనకు ప్రేరేపించిన వైసీపీ నేతలను మాత్రం వదిలేయడంపై బాధితుడి కుటుంబం ఆక్రోశం వ్యక్తం చేస్తోంది.
Recommended Video
ఈ వ్యవహారంపై రాష్ట్రపతికి లేఖ రాసిన వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే స్పందించి బాధితుడు వరప్రసాద్ వెనుక కొందరు ఉండి ఇవన్నీ చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై దళిత సంఘాల మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా రాష్ట్రపతి కార్యాలయం నుంచే విచారణకు ఆదేశాలు రావడంతో ఇప్పుడు పోలీసు అధికారులతో పాటు వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.