సీతానగరం శిరోముండనం కేసు: రాష్ట్రపతి కార్యాలయం తాజా ఆదేశాలివే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగిన శిరోముండనం ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీతానగరం శిరోముండనం కేసు ఫైల్ను కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని రాష్ట్రపతి కార్యదర్శి అశోక్ కుమార్ ఆదేశించారు. శిరోముండనం నేపథ్యంలో తనను నక్సలైట్గా మారేందుకు అవకాశమివ్వాలంటూ గతంలో బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్న రాష్ట్రపతి కార్యాలయం.. దీనిపై పరిశీలించాలని ఏపీ జేఏడీ సహాయ కార్యదర్శి జనార్ధన్ బాబుకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. అనంతపురం జనార్ధనబాబును తాను సంప్రదించినా స్పందనలేదని బాధితుడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు రాష్ట్రపతి కార్యాలయం స్పందించడంతో.. అట్రాసిటీ కేసులో భాగంగా రూ. 50 వేల పరిహారాన్ని రెవెన్యూ అధికారులు బాధితుడు ప్రసాద్ కు అందజేశారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కవల కృష్ణమూర్తి అతని అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ప్రసాద్ ఆరోపించారు. నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నేతలు కూడా శిరోముండనం ఘటనపై ఏపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోతోందని ధ్వజమెత్తారు.