టి: 2 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన, రేసులోని నేతలకు షాక్
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోను రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయట. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జనవరి 23వ తేదీ వరకు మూడు దఫాల్లో అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఆ తర్వాత రాష్ట్రపతికి ముసాయిదా బిల్లును పంపిస్తారు. జనవరి నెలలో రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని తెలంగాణ ప్రాంత నేతలు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర), తెలంగాణ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తోందట. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం చెప్పారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల్లోను రాష్ట్రపతి పాలన పెట్టే అంశంపై అధిష్టానం యోచిస్తోందన్నారు.
రాష్ట్రాల ఏర్పాటు తర్వాత మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల కోసం ముఖ్యమంత్రులను పెట్టక పోవడమే మంచిదని అధిష్టానం భావిస్తోందన్నారు. కొత్త రాష్ట్రం ఫిబ్రవరి నెలలో ఏర్పడుతుందని దామోదర చెప్పారు.
మార్చి మొదటి వారంలో ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తుందని, అప్పటి నుండి ప్రభుత్వాలు ఏ విధమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదని, దీంతో ముఖ్యమంత్రులను నియమించకపోవడమే మంచిదని భావిస్తోందన్నారు. రాష్ట్రపతి పాలనపై ఆలోచన చేస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రి కోసం పోటాపోటీ
కాంగ్రెసు పార్టీలు తెలంగాణలో, సీమాంధ్రలో ముఖ్యమంత్రి కోసం పోటా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు నెలల కోసం ఒకరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా ఇబ్బందులు ఏర్పడుతాయనే ఉద్దేశ్యంతోనే అధిష్టానం రాష్ట్రపతి పాలన వైపు మొగ్గు చూపిస్తోందంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో దామోదర, జానా రెడ్డి, డి శ్రీనివాస్ తదితరులు, సీమాంధ్రలో కిరణ్, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణ తదితరులు రేసులో ఉన్నారు.