రాష్ట్రపతి పాలనకే మొగ్గు: కిరణ్ వస్తే... జగన్పై సబ్బం
చంద్రబాబు లేఖతోనే: ఆజాద్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖతోనే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో అన్నారు. ఎపిలో అన్ని పార్టీలు విభజనను కోరుకున్నాయని, నిర్ణయానికి కట్టుబడతామన్న వారు ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారని ఆరోపించారు.
ఆపద్ధర్మ సిఎంకు కిరణ్ నో
కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన గవర్నర్ నరసింహన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. దానిని కిరణ్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఆపద్ధర్మ సిఎంగా కొనసాగాలని నరసింహన్ కోరారు.
ముఖ్యమంత్రిపై గండ్ర
కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించరాదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దయవల్లే తెలంగాణ ప్రజల కల సాకారమయిందన్నారు. భారతీయ జనతా పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుది వన్ సైడ్ లవ్ అన్నారు. బిజెపితో కలిసి చంద్రబాబు చివరి వరకు తెలంగాణను ఆపడానికి ప్రయత్నించారన్నారు.
కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలందరూ రాష్ట్ర విభజనపై ఉత్కంఠగా ఉండటంతో, కిరణ్ రాజీనామా పెద్దగా హైలైట్ కాలేదన్నారు.
సమైక్యత కోసం కిరణ్, లగడపాటి, కెవిపిలు చాలా కృషి చేశారన్నారు. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ శూన్యత ఉందని, టిడిపి, బిజెపి కలిసుంటే వారికి రానున్న ఎన్నికల్లో మెజారిటీ లభిస్తుందన్నారు. సమైక్యం కోసం ఏ నాయకుడు నిజంగా పోరాడాడనే విషయంలో సీమాంధ్ర ప్రజలకు పూర్తి స్పష్టత ఉందన్నారు.
కిరణ్ సమైక్యత కోసం పాటుపడితే, జగన్ విభజనకు సహకరించారని, చంద్రబాబు సమన్యాయం అన్నారన్నారు. కిరణ్ పార్టీ పెడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నష్టం జరగవచ్చునన్నారు. లగడపాటి ఎన్నికల్లో పోటీ చేయకున్నా రాజకీయాల్లో ఉంటారని తెలిపారు.