ఏబీఎన్, టీవీ 9: టీలో చానళ్ల బ్యాన్పై కమిటీ ఆక్షేపణ
న్యూఢిల్లీ: తెలంగాణా రాష్ట్రంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 టెలివిజన్ చానళ్ల నిషేధాన్ని ప్రెస్ కౌన్సిల్ కమిటీ తీవ్రంగా ఆక్షేపించినట్లుగా తెలుస్తోంది. ఈ చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తూ ఎమ్మెస్వోలు నిర్ణయం తీసుకుంటే వాటిని సమర్ధించడాన్నిబట్టి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 నిషేధం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హస్తం ఉన్నట్టేనని కమిటీ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.
వరంగల్ సభలో కేసీఆర్ మీడియాను పాతరేస్తామనడం ఆ కుర్చీకే అవమానం అని, ఇది కేవలం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 టెలివిజన్ చానళ్లనే గాక మొత్తం మీడియానే లొంగదీసుకునే ప్రయత్నం అని ఈ కమిటీ అభిప్రాయపడిందని సమాచారం. రాష్ట్రంలో రెండు చానళ్ల నిషేధానికి సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన ప్రత్యేక మీడియా కమిటీ ఈ అంశంపై ప్రెస్ కౌన్సిల్కు తమ నివేదిక సమర్పించింది.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఎమ్మెస్వోలను ఆదేశించి టెలివిజన్ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించేటట్టు చర్యలు తీసుకోవాలని ఈ కమిటీ తమ సిఫార్సులలో పేర్కొన్నది. ఈ కమిటీ నివేదికను ప్రెస్ కౌన్సిల్ ఆమోదించింది. కమిటీ నిపేదికను ప్రెస్ కౌన్సిల్ తెలంగాణ ముఖ్యమంత్రికి, ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం శాఖకు పంపించనున్నది.
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఎదుట మహిళా జర్నలిస్టులు ధర్నా చేస్తే వారిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కూడా కమిటీ ఈ నివేదికలో ఆక్షేపించిందని తెలుస్తోంది. అందుకు బాధ్యులైన పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని అరెస్టు కూడా చేయాలని కమిటీ పేర్కొందని సమాచారం.
జర్నలిస్టులు తెలంగాణ పక్షం వహించారా లేదా అన్న ప్రాతిపదిక గా ప్రభుత్వం ప్రవర్తించకూడదని కమిటీ విజ్ఞప్తి చేసింది. ఆ ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుని, ఎమ్మెస్వోలను వెనకేసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి పదవికి కళంకం తీసుకురాకూడదని కమిటీ సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
జర్నలిస్టులను పక్షపాత దృక్పథంతో చూడకూడదని కమిటీ సూచించింది. తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారశైలిని కమిటీ తీవ్రంగా ఆక్షేపించిందని సమాచారం. పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం మంచిది కాదని కమిటీ తెలిపింది. కాగా, నాలుగు నెలలకు పైగా తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలు నిలిచి పోయిన విషయం తెలిసిందే.