చిరంజీవిపై ఒత్తిడి: 11 మంది ఎమ్మెల్యేలు జంప్?
హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవిపై గత ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కట్టడి చేయాల్సిన ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైన తర్వాత ఆ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులంతా కాంగ్రెసు శాసనసభ్యులుగా మారిపోయారు. గత ఎన్నికల్లో చిరంజీవితో పాటు 18 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. చిరంజీవి శాసనసభకు రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా వెళ్లిపోయి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు.
ప్రస్తుతం ప్రజారాజ్యం పార్టీకి చెందిన 17 మంది కాంగ్రెసు శాసనసభ్యులుగా ఉన్నారు. వారిలో ఇద్దరికి మంత్రి పదవి కూడా దక్కింది. గంటా శ్రీనివాస రావు, సి. రామచంద్రయ్య మంత్రి పదవులు చేపట్టారు. రామచంద్రయ్య అంతరం తెలియడం లేదు గానీ గంటా శ్రీనివాస రావు కాంగ్రెసుకు రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరో నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు.
కాగా, ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన 17 మంది శాసనసభ్యుల్లో 11 మంది ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజనపై అసంతృప్తికి గురైనవారు కాంగ్రెసులో భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో పార్టీ మారాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వారందరూ సీమాంధ్రకు చెందినవారు.
తన రాజకీయ భవిష్యత్తు కోసమైనా తన ప్రజారాజ్యం పార్టీకి చెందిన శాసనసభ్యులను కట్టడి చేసి, ఇతర పార్టీలకు వెళ్లకుండా చూసుకోవాల్సిన అనివార్యతలో చిరంజీవి పడ్డారు. చిరంజీవితో పాటు నలుగురు శాసనసభ్యులు మాత్రమే కాంగ్రెసులోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సీమాంధ్రకు చెందిన వంగా గీత, కన్నబాబులతో పాటు తెలంగాణకు చెందిన ఇ. అనిల్ కుమార్, ఎ మహేశ్వర రెడ్డి ఇతర పార్టీలకు వెళ్లకుండా కాంగ్రెసులో ఉంటారని చెబుతున్నారు.
కాంగ్రెసు పార్టీ నుంచి వెళ్లాలని భావిస్తున్న 11 మంది శాసనసభ్యులు కూడా ఓ వైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో, మరో వైపు తెలుగుదేశం పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానం ఆదేశాలతో చిరంజీవి తన వర్గానికి చెందిన పాత ప్రజారాజ్యం శాసనసభ్యులతో ఇటీవల తన నివాసంలో సమావేశమయ్యారు. కాంగ్రెసులోనే ఉండాలని చిరంజీవి వారికి సూచించారు. అయితే, చిరంజీవి మాటలను ఖాతరు చేసేందుకు వారు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.