జగన్ ఎఫెక్ట్: గందరగోళంలో టిడిపి, అందుకే 'ఆది'ని నిలువరించారా?
అమరావతి: ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6వ, తేదిన రాజీనామాలు చేస్తామని ప్రకటించారు.ఈ ప్రకటన టిడిపిపై ఒత్తిడిని తీసుకొచ్చింది.మరో వైపు టిడిపి ఎంపీలు కూడ రాజీనామాలు చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. అయితే వైసీపీ సవాల్కు మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. మార్చి 5వ, తేదినే టిడిపి ఎంపీలు రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇది తన వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించారు . ఈ పరిణామాలన్నీ చూస్తే టిడిపిలో గందరగోళ పరిస్థితులు ఉన్నట్టు కన్పిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్కు కౌంటర్: మార్చి 5నే టిడిపి ఎంపీల రాజీనామా: ఆది
వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటనతో టిడిపి ఒత్తిడి
వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6వ, తేదిన రాజీనామా చేయనున్నారు. అయితే ఏపీకి కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నుండి సానుకూల స్పందన రాకపోతే ఏం చేయాలనే దానిపై టిడిపి నేతలు చర్చిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగితే రాజకీయంగా ఏ రకంగా ప్రయోజనం ఉంటుందనే విషయాలపై చర్చిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందో చూడాలనే అభిప్రాయంతో టిడిపి నేతలు ఉన్నారు.
టిడిపిని ట్రాప్లో పడేసిన వైసీపీ
ప్రత్యేక హోదా విషయమై ఆందోళనల పేరుతో టిడిపితో పాటు ఇతర రాజకీయపార్టీలపై వైసీపీ పై చేయి సాధించింది. ఏపీలో అధికారంలో ఉన్న టిడిపికి వైసీపీ చేసిన ప్రకటన రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే రాజీనామాలు చేస్తే ప్రయోజనం ఉండేది, బిజెపితో తెగదెంపులు చేసుకొంటే కేంద్రంపై ఒత్తిడి పెరిగేదని జెసి దివాకర్ రెడ్డి లాంటి నేతలు రెండేళ్ళ క్రితమే బాబుకు చెప్పారు. అయితే ఆ సమయంలో రాజీనామాకు సిద్దమైన జెసిని చంద్రబాబునాయుడు నిలువరించారు. అయితే రాజీనామాలు చేస్తామని వైసీపీ ఇప్పుడు ప్రకటించి ప్రజల అటెన్షన్ను తమ వైపుకు తిప్పుకొంది.ఈ తరుణంలో వైసీపీపై పై చేయి సాధించాలంటే ఏం చేయాలనే దిశలో టిడిపి ఆలోచిస్తోంది. ఈ తరుణంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మార్చి 5వ, తేదినే కేంద్రంతో తెగదెంపులు చేసుకొంటామని చెప్పి ఆ తర్వాత ఆ మాటలు తన వ్యక్తిగతమని ప్రకటించారు. ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.
వైసీపీ పై చేయి ఎలా సాధిస్తోంది
వైసీపీపై రాజకీయంగా టిడిపి పై చేయి సాధించాలంటే ప్రత్యేక హోదాకు సమానంగా ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేంద్రం నుండి రాబట్టుకోవాలి. అంతేకాదు కేంద్రం ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకు నిర్ధిష్ట టైంబౌండ్తో పాటు నిధుల విడుదల విషయమై స్పష్టమైన హమీని మార్చి5వతేదిలోపుగానే ఏప్రిల్ 6వ, తేది లోపుగా పొందాలి. లేదా కేంద్రం నుండి సానుకూలమైన స్పందన రాకపోతే ఏప్రిల్ 6వ, తేదిలోపుగానే బిజెపితో తెగదెంపులు చేసుకోవాలి. ఇలా అయితే వైసీపీపై టిడిపి పై చేయి సాధించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వేచి చూసే ధోరణి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజున రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రస్తావించిన అంశాలనే చెప్పారు. కానీ, రాజ్యసభ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆర్థిక మంత్రి జైట్లీతో చర్చించారు. అయితే ఆ సమావేశంలో కేంద్రానికి రావాల్సిన నిధుల కేటాయింపు విషయమై సానుకూలంగా కేంద్రం నుండి సంకేతాలు ఉన్నాయని టిడిపి ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు. మార్చి5వ, తేదిన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఆ సమయంలో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టిడిపి నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ రాజకీయంగా వేడిని రాజేయడంతో టిడిపి కాస్త ఆత్మరక్షణలో పడింది.
సరైన సమయంలో రాజీనామాలపై నిర్ణయం
టిడిపి ఎంపీలు రాజీనామాలు చేసే విషయమై సరైన సమయంలో నిర్ణయం తీసుకొంటామని ఆ పార్టీ ప్రకటించింది. అంతేకాదు బిజెపితో కూడ మిత్రత్వాన్ని కూడ తెగదెంపులు చేసుకొనే అవకాశం ఉందని కూడ ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అయితే కేంద్రం నుండి సానుకూల సంకేతాలు వస్తాయనే ఆశతోనే మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటన చేసిన వెంటనే టిడిపి నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటారని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. అంతేకాదు అదే సమయంలో మంత్రి ఆదినారాయణరెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చి రాజీనామాలపై తనది వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు.